కంగువ డిమాండ్ చూస్తే మైండ్ బ్లాంకే

సూర్య హీరోగా సౌత్ ఇండియాలో రూపొందుతున్న అత్యంత భారీ బడ్జెట్ సినిమాల్లో ఒకటిగా చెప్పబడుతున్న కంగువ బిజినెస్ డీల్స్ మొదలైపోయాయి. తమిళంలో దీనికి క్రేజ్ ఉండటంలో ఆశ్చర్యం లేదు కానీ అనూహ్యంగా తెలుగులోనూ డిమాండ్ పెరగడం షాక్ కలిగించే విషయం.

ఒక్క నైజామ్ ఏరియాకే ఇరవై కోట్ల దాకా ధర పలికిందనే వార్త నిన్న ఫిలిం నగర్ వర్గాల్లో హాట్ టాపిక్ గా మారింది. అధికారిక ధృవీకరణ రావాల్సి ఉంది. స్టూడియో గ్రీన్ తో పాటు యువి క్రియేషన్స్ నిర్మాణ భాగస్వామిగా ఉండటం వల్ల గ్రాండ్ రిలీజ్ కు అవకాశం దొరుకుతోందని ట్రేడ్ వర్గాల టాక్.

ఇక కంగువకు ఇంత హైప్ రావడానికి కారణాలు లేకపోలేదు. టైం ట్రావెల్ కాన్సెప్ట్ మీద గతం, వర్తమానం రెండు బ్యాక్ డ్రాప్స్ తీసుకుని దర్శకుడు సిరుతై శివ చాలా కొత్త ప్రయోగం చేశాడు. టీజర్ లో చూపించిన విజువల్స్ వందల సంవత్సరాల క్రితం నాటి అటవీ జాతివి కావడంతో అభిమానుల అంచనాలు మాములుగా లేవు.

ఇంకో గెటప్ ని రివీల్ చేయలేదు. యానిమల్ విలన్ బాబీ డియోల్ ప్రతి నాయకుడిగా నటించడం, దిశా పటాని హీరోయిన్ కావడం, పుష్ప నుంచి జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న దేవిశ్రీ ప్రసాద్ సంగీతం సమకూర్చడం హైప్ ని ఎక్కడికో తీసుకెళ్తున్నాయి.

దేవర వదిలేసిన అక్టోబర్ 10 విడుదల కాబోతున్న కంగువని ఐమాక్స్ తో పాటు 3డి వెర్షన్ ని సిద్ధం చేస్తున్నారు. కోలీవుడ్ నుంచి
ఇప్పటిదాకా ఎవరూ ఇవ్వని థియేటర్ ఎక్స్ పీరియన్స్ కంగువ ఇస్తుందని చెన్నై మీడియా తెగ ఊదరగొడుతోంది. అయితే కల్కి 2898 ఏడిని తలపించేలా గ్రాఫిక్స్, కంటెంట్ ఉంటాయా లేదానేది వేచి చూడాలి.

రెండేళ్లకు పైగా వేరే సినిమా చేయకుండా దీని మీదే ఉన్న సూర్య కంగువ తనకు ప్యాన్ ఇండియా ఇమేజ్ తీసుకొస్తుందనే నమ్మకంతో ఉన్నాడు. రజనీకాంత్ కు పెద్దన్న రూపంలో సూపర్ ఫ్లాప్ ఇచ్చిన సిరుతై శివ దీంతోనే తిరిగి ప్రూవ్ చేసుకోవాల్సి ఉంది.