మీర్జాపూర్ 3 ఎలా ఉందంటే

మాములుగా వెబ్ సిరీస్ లకు క్రేజ్ రావడం అన్నింటికి జరగదు. మన దేశంలో విపరీతమైన పాపులారిటీ తెచ్చుకున్న అలాంటి వాటిలో మీర్జాపూర్ ఒకటి. మొదటి రెండు సీజన్లు బ్లాక్ బస్టర్ కాగా మూడో దాని మీద మంచి అంచనాలు నెలకొన్నాయి. అమెజాన్ ప్రైమ్ కి గతంలో చందాదారులను పెంచడంలో దీని పాత్ర చాలానే ఉంది. హింస, బూతులు విపరీతంగా ఉన్నాయనే విమర్శలు ఎన్ని వచ్చినప్పటికీ ఎదురు చూసే ప్రేక్షకులు మాత్రం ప్రపంచవ్యాప్తంగా కోట్లలో ఉన్నారు. మరి ఇంత హైప్ తో వచ్చిన ఈ ఫ్యామిలీ పొలిటికల్ డ్రామా అంచనాలకు తగ్గట్టు ఉందో లేదో క్లుప్తంగా చూద్దాం.

సీజన్ 2లో మున్నా (దివ్యెందు) చనిపోయాక కాలీన్ భయ్యా తీవ్ర గాయాలతో అదృశ్యమవుతాడు. మూడో భాగం ఇక్కడి నుంచి స్టార్ట్ అవుతుంది. మీర్జాపూర్ మీద ఆధిపత్యం చెలాయించాలని నిర్ణయించుకున్న గుడ్డు (అలీ ఫజల్) అరాచకాలకు తెరతీస్తాడు. ఇంకో వైపు ముఖ్యమంత్రిగా ఉన్న మున్నా భార్య మాధురి యాదవ్ (ఇషా తల్వార్) రాష్ట్ర రాజకీయాలను తన చుట్టూ తిరిగేలా వ్యూహం పన్నుతుంది. అందరూ అనుకున్నట్టు కాలీన్ చనిపోయి ఉండడు. శరద్ శుక్లా (అంజుమ్ శర్మ) సహాయంతో మరో చోట ప్రాణాలతో గట్టెక్కుతాడు. అసలు ఆట ఇక్కడి నుంచి మొదలవుతుంది. ఎవరు గెలిచారనేది స్టోరీ.

ఒక్కొకటి యాభై నిమిషాలకు పైగా మొత్తం పది ఎపిసోడ్లు ఉండటంతో మీర్జాపూర్ 3 బాగా సాగతీతకు గురయ్యింది. పరస్పర దాడులు, కుట్రలతో డ్రామా నడిపించే ప్రయత్నం చేసినా ఒక దశ దాటాక ఊహించేలా కథనం సాగి బోర్ కొట్టేస్తుంది. దానికి తోడు పంకజ్ త్రిపాఠి పాత్రను తీవ్రంగా పరిమితం చేయడంతో ఇంపాక్ట్ తగ్గిపోయింది. బోల్డ్ కంటెంట్ కు లోటు లేదు. గుడ్డు, శుక్లాల మధ్య క్లాష్ ఆశించినంత స్థాయిలో పండలేదు. చివరి మూడు ఎపిసోడ్లలో మాత్రం వేగమందుకుంటుంది. అదంతా ఫ్యాన్స్ కు నచ్చుతుంది. చాలా ఓపిక ఉంటేనే అక్కడి దాకా రాగలం. ఎక్కువ ఊహించుకుని మీర్జాపూర్ 3 చూస్తే మాత్రం నిరాశ తప్పదు. నాలుగో సీజన్ డౌటే.