ఆస్తులు అమ్మించిన భారీ డిజాస్టర్లు

పూలు అమ్మిన చోటే కట్టెలు అమ్మాల్సి రావడం పాత సామెతే అయినా సినీ పరిశ్రమలో ఇది ఎన్నోసార్లు రుజువైన సత్యం. కాకపోతే కొన్నిసార్లు పరిణామాలు మరీ దారుణంగా ఉంటాయి. బాలీవుడ్ లో పూజా ఎంటర్ టైన్మెంట్స్ ది నాలుగు దశాబ్దాల సుదీర్ఘ చరిత్ర.

దాని అధిపతి వశు భగ్నాని గురించి తెలియని వారు ఉండరు. స్టార్ హీరోలు అందరితోనూ ఎన్నో బ్లాక్ బస్టర్లు తీసిన ట్రాక్ రికార్డు ఆయనది. అలాంటి టాప్ ప్రొడ్యూసర్ తలమీద వచ్చి కూర్చున్న 250 కోట్ల నష్టాలను పూడ్చుకోవడం కోసం ఏడు ఫ్లోర్లు ఉన్న తన విశాలమైన ఆఫీసుని అమ్మేయడం చాలా పెద్ద హాట్ టాపిక్ గా మారింది.

ఇదొక్కటే కాదు జనవరి నుంచి మొదలుపెట్టి ఇప్పటిదాకా 80 శాతం ఉద్యోగులకు స్వస్తి చెప్పడం సంస్థ పరిస్థితిని తేటతెల్లం చేస్తోంది. ఇలా జరగడానికి కారణం గత కొన్ని నెలల్లో భగ్నానీని దారుణంగా దెబ్బ తీసిన డిజాస్టర్లు.

ఒకటి బడేమియా చోటేమియా కాగా రెండోది గణపథ్. ఇవి ఎంత ఘోరంగా ఫ్లాప్ అయ్యాయంటే రెండో రోజే థియేటర్లు ఖాళీ అవుతున్నాయని డిస్ట్రిబ్యూటర్లు గగ్గోలు పెట్టేంత.

వీటిలో అక్షయ్ కుమార్, టైగర్ శ్రోఫ్, అమితాబ్ బచ్చన్, పృథ్విరాజ్ సుకుమారన్, కృతి సనన్ లాంటి భారీ క్యాస్టింగ్ కి వందల కోట్ల రెమ్యునరేషన్లు ఇచ్చి తీసుకున్నా ఫలితం మాత్రం సున్నానే దక్కింది.

అలా అని ప్రొడక్షన్ ని ఆయనేమి ఆపడం లేదు కానీ కార్యకలాపాలను మరో చిన్న ఆఫీసుకి షిఫ్ట్ చేశారు. దీన్ని బట్టి అర్థం చేసుకోవాల్సింది ఒకటుంది. కేవలం కాంబినేషన్ క్రేజ్ మీద వందల కోట్లు పెట్టి కంటెంట్ ని సీరియస్ గా తీసుకోకపోతే పరిణామాలు ఇలాగే ఉంటాయి.

ఎంత చరిత్ర ఉన్నా సరే తలమీద గుడ్డ వేసుకోవాల్సి ఉంటుంది. ఓటిటి మార్కెట్ బాగా తగ్గిపోయి డిజిటల్ కంపనీలు ఆచితూచి బేరాలాడుతున్న ట్రెండ్ లో గుడ్డిగా ఆ హక్కులనే నమ్ముకుంటే నిండా మునిగిపోవాల్సిందే. ఒకరకంగా ఇది పాఠం లాంటిది. చిన్నా పెద్ద తేడా లేకుండా అందరు నిర్మాతలు నేర్చుకోవాల్సిందే.