అర్ధరాత్రి షోల మీద తీరని సస్పెన్స్

ఏపీలో ప్రభుత్వం మారి సినీ పరిశ్రమకు అనుకూలంగా ఉండే టిడిపి జనసేన కూటమి వచ్చాక ఇప్పుడు అందరి కళ్ళు జూన్ 27 మీద ఉన్నాయి. ఈ ఏడాదిలోనే అతి పెద్ద ప్యాన్ ఇండియా మూవీ కల్కి 2898 ఏడి విడుదల నేపథ్యంలో దానికి రాబోయే టికెట్ రేట్ల పెంపు, స్పెషల్ షోల పర్మిషన్ల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. ముఖ్యంగా అర్ధరాత్రి ప్రీమియర్ల మీద ఫ్యాన్స్ చాలా ఆశలు పెట్టుకున్నారు. టీమ్ నుంచి అందుతున్న సమాచారం మేరకు రాత్రి 1 గంటకు షోలు వేయాలా వద్దా అనే దాని మీద ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. చర్చలు జరుగుతున్నాయి.

యుఎస్ లో ప్రీమియర్లు అదే సమయానికి మొదలైపోతాయి. భారత కాలమాన ప్రకారం ఉదయం నిద్రలేచే లోపే అక్కడి రివ్యూలు సోషల్ మీడియాలో వెల్లువలా వచ్చి పడతాయి. అడ్వాన్స్ బుకింగ్ అమ్మకాలు చూస్తుంటే బాహుబలి, సలార్ కంటే అత్యధిక శాతం ఎన్ఆర్ఐలు కల్కి ఫస్ట్ డే ఫస్ట్ షో చూడబోతున్నారు. వాళ్ళ ద్వారా వచ్చే రిపోర్టులు, స్పాయిలర్ లీకేజులు కంట్రోల్ చేయడం కష్టం. టాక్ చాలా బాగుంటే డబుల్ ప్లస్ అవుతుంది. లేదూ ఏదైనా కొంచెం అటుఇటుగా మిశ్రమంగా వినిపిస్తే ఇబ్బందే. దానికి బదులు వరల్డ్ వైడ్ ఒకేసారి షోలు పడాలంటే ఇండియా వైడ్ అర్ధరాత్రి కన్నా వేరే ఆప్షన్ ఉండదు.

తెలంగాణలో సింగల్ స్క్రీన్ల వరకు ఒంటి గంట షోలు వేసుకునేందుకు డిస్ట్రిబ్యూటర్లు ప్లాన్ చేస్తున్నారట. అదే జరిగితే ఏపీలోనూ అదే టైంకి పడాలి. అయితే నిర్మాత అశ్వినీదత్, దర్శకుడు నాగ అశ్విన్, ప్రియాంక, స్వప్న ఏం చేస్తే బాగుంటుందనే దాని మీద ఇంకో రెండు మూడు రోజుల్లో తేల్చబోతున్నారు. కొత్త ట్రైలర్ ఏ క్షణమైనా రావొచ్చు. బజ్ పరంగా అభిమానులు కొన్ని సందేహాలు పెట్టుకున్నా రిలీజ్ రోజు నాటికి థియేటర్ల దగ్గర పోటెత్తబోయే జనం ఊహకందని విధంగా ఉంటుందని బయ్యర్లు ధీమా వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా మొదటి వీకెండ్ రికార్డులకు పాతర వేయడం ఖాయమని చెబుతున్నారు.