సెన్సేషన్ : హత్య కేసులో స్టార్ హీరో

రాబర్ట్ లాంటి డబ్బింగ్ సినిమాల ద్వారా మనకు కొంత పరిచయమున్న శాండల్ వుడ్ స్టార్ హీరో దర్శన్ ని మైసూర్ షూటింగ్ నుంచి అరెస్ట్ చేసి బెంగళూరు పోలీసులు తీసుకెళ్లడం సంచలనంగా మారుతోంది. విపరీతమైన దూకుడు ప్రవర్తన కలిగిన నటుడిగా పేరున్న దర్శన్ గతంలోనూ పలు వివాదాల్లో చిక్కుకున్నాడు. అయితే వరస బ్లాక్ బస్టర్లతో సక్సెస్ లో ఉండటంతో చాలా ఇష్యూలు పెద్ద స్థాయికి వెళ్ళలేదు. గత ఏడాది డిసెంబర్ లో సలార్ కు పోటీగా తన కాటేరాని నిలబెట్టి కర్ణాటకలో బ్లాక్ బస్టర్ అందుకున్న దర్శన్ ఇప్పుడు ఏకంగా యువకుడి హత్య కేసులో చిక్కుకోవడం చిన్న మ్యాటర్ కాదు.

బెంగళూర్ మీడియా ప్రకారం వివరాలిలా ఉన్నాయి. ఈ నెల ఎనిమిదో తేదీన చిత్రదుర్గకు చెందిన రేణుకా స్వామి దారుణంగా హత్యచేయబడ్డాడు. స్థానిక మెడికల్ షాపులో ఇతను ఉద్యోగస్థుడు. ముందు సూసైడ్ గా భావించిన పోలీసులు విచారణ చేసే కొద్దీ విస్తుపోయే నిజాలు తెలియడంతో వ్యవహారం మొత్తం తవ్వడం మొదలుపెట్టారు. పవిత్ర గౌడ అనే నటికి రేణుక స్వామి తరచు అభ్యంతరకరమైన మెసేజులు పంపించేవాడట. సోషల్ మీడియా అకౌంట్ లో దర్శన్, పవిత్రల మధ్య ఏదో ఉందనే తరహాలో కామెంట్లు పెట్టవాడట. ఇవి కాస్తా ముదిరిన స్టేజిలో రేణుక హత్యకు గురి కావడం నివ్వెరపోయేలా చేసింది.

దర్శన్ కు బాగా సన్నిహితుడైన వినయ్ అనే వ్యక్తి ద్వారా ఇదంతా జరిగిందని, మర్డర్ కు ఉపయోగించిన ఆయుధాలు అతని షెడ్డువే అనేందుకు ప్రాధమిక ఆధారాలు దొరికినట్టు సమాచారం. ప్రస్తుతం ఇన్వెస్టిగేషన్ స్టేజిలో ఉంది కాబట్టి ఇంకా నిజానిజాలు నిర్ధారణ కాలేదు కానీ ఫ్యాన్స్ మాత్రం తీవ్ర ఒత్తిడిలో అయోమయానికి గురవుతున్నారు. 2011 గృహహింస, 2016లో అభ్యంతరకర ప్రవర్తన, 2021 ఒక వెయిటర్ ని అవమానించిన కేసు, 2023 అటవీ ప్రాణి మాంసం ఇలా పలుమార్లు దర్శన్ వివాదాల్లో ఉంటూ వచ్చారు. మరి రేణుకా స్వామి వ్యవహారంలో దోషా నిర్దోషా తేల్చాల్సింది పోలీసులే.