తీవ్ర వివాదంలో అమీర్ కొడుకు సినిమా

కాంట్రావర్సీలు కేవలం థియేటర్ సినిమాలకే కాదు ఓటిటి రిలీజులకు కూడా ఉంటాయి. కాకపోతే డిజిటల్ ప్రపంచంలో అడ్డుకోవడానికి మార్గాలు తక్కువ. కోర్టుకు వెళ్లడం తప్ప వేరే ఆప్షన్ ఉండదు. ఈ నెల 14న అమీర్ ఖాన్ కొడుకు జునైద్ డెబ్యూ మూవీ మహారాజ్ నెట్ ఫ్లిక్స్ ద్వారా విడుదల కానుందని పది రోజుల క్రితమే అఫీషియల్ అనౌన్స్ మెంట్ వచ్చింది. అయితే ఇందులో తమ మనోభావాలు దెబ్బ తినే విషయాలు ఉన్నాయంటూ భజరంగ్ దళ్ వార్నింగ్ ఇవ్వడమే కాక ముందు తమకు ప్రైవేట్ స్క్రీనింగ్ చేశాకే ప్రదర్శన చేయాలని అల్టిమేటం ఇచ్చాయి. అసలు కథేంటో చూద్దాం.

1862లో దేశవ్యాప్తంగా సంచలనం రేపిన మహారాజ్ లైబిల్ కేసు ఆధారంగా దర్శకుడు సిద్దార్థ్ పి మల్హోత్రా దీన్ని రూపొందించారు. మత విశ్వాసాలను అడ్డం పెట్టుకుని అమాయక అమ్మాయిల జీవితాలతో ఆడుకునే కొందరి దుర్మార్గాల గురించి ఇందులో తెరకెక్కించారు. జునైద్ ఈ అక్రమాన్ని వెలికి తీసే జర్నలిస్ట్ గా నటించగా వల్లభాచార్య వర్గానికి చెందిన బ్రిజ్ రతన్ జీ మహారాజ్ గా జైదీప్ ఆహ్లావత్ కనిపిస్తారు. ఈ ఇద్దరి మధ్య జరిగే యుద్ధమే అసలు పాయింట్. అప్పుడు జరిగిన సంఘటనలకు సంబంధించి విపరీతమైన శ్రమతో ఎంతో రీసెర్చ్ చేసి మరీ ఈ సబ్జెక్టుని తయారు చేసినట్టు టీమ్ చెబుతోంది.

ఇంకో నాలుగు రోజులు మాత్రమే టైం ఉంది. నెట్ ఫ్లిక్స్ ప్రమోషన్ చేయడం లేదు. దర్శక నిర్మాతలు సైలెంట్ గా ఉన్నారు. అసలు ట్రైలరే రాలేదు. మరి భయపడి వాయిదా వేశారా లేక వివాదం ఉంది కాబట్టి గుట్టుచప్పుడు కాకుండా రిలీజ్ చేస్తారానేది సస్పెన్స్ గానే ఉంది. జునైద్ ఖాన్ యాక్టింగ్ మీద అభిమానులు భారీ అంచనాలు పెట్టుకున్నారు. ఏదో రెగ్యులర్ లవ్ స్టోరీ ఎంచుకోకుండా ఇలా కంటెంట్ ఉన్న కాన్సెప్ట్ ని తీసుకోవడం వెనుక తండ్రి అమీర్ ప్రోత్సాహం ఉండే ఉంటుంది. చూడాలి మరి చెప్పిన టైంకి వస్తుందో లేక పోస్ట్ పోన్ చేసి నిరాశపరుస్తారో ఈ వారం తేలిపోతుంది.