నాగార్జునకు మాత్రమే దక్కిన అదృష్టం

స్టార్ హీరోలు ఎవరైనా కొన్ని ప్రతిష్టాత్మక బ్యానర్లలో కనీసం ఒక్క సినిమా అయినా ఉండాలని కోరుకుంటారు. ఆయా సంస్థల అధినేతలు కూడా ఆ దిశగానే ప్లాన్ చేసుంటారు. ఇప్పుడీ ప్రస్తావనకు కారణముంది. రెండో తరం సీనియర్ స్టార్లు మనకు నలుగురు ఉన్నారు.

నిన్న శివైక్యం చెందిన ఈనాడు అధినేత రామోజీరావు తన ఉషాకిరణ్ మూవీస్ ద్వారా ఎన్ని గొప్ప ఆణిముత్యాలు ఇచ్చారో సినీ ప్రియులందరూ గుర్తు చేసుకున్నారు. ముఖ్యమైన విశేషం ఏంటంటే రామోజీరావు ఏనాడూ పెద్ద హీరోలతో బడా బడ్జెట్ సినిమాలు తీయాలని ప్రయత్నించలేదు. క్వాలిటీ తప్ప క్వాంటిటీ ముఖ్యమనే సిద్ధాంతం ఆయనది.

అందుకే చిరంజీవి, బాలకృష్ణ, వెంకటేష్ లతో ఉషాకిరణ్ ఏ మూవీ చేయలేదు. కానీ ఒక్క నాగార్జునకు మాత్రమే ఆ అదృష్టం దక్కింది. 2001 సంవత్సరం సింగీతం శ్రీనివాసరావు దర్శకత్వంలో ఆకాశవీధిలో వచ్చింది.

రామోజీ ఫిలిం సిటీ స్థాపించిన తొలినాళ్ళలో అందులో ఉన్న అద్భుతాలను కళ్ళకు కట్టినట్టు చూపించి వాడుకునే క్రమంలో పలువురు దర్శక రచయితలు ఆ దిశగా కథలు రాసుకునేవారు. హనుమాన్ హీరో తేజ సజ్జ చైల్డ్ ఆర్ట్స్ గా డ్యూయల్ రోల్ చేసిన చిత్రమిది. నాగార్జున సరసన రవీనాటాండన్ నటించగా ఇప్పటి ఆస్కార్ విజేత ఎంఎం కీరవాణి సంగీతం సమకూర్చారు. అంచనాలు విపరీతంగా ఉండేవి.

దురదృష్టం ఏంటంటే ఆకాశవీధిలో దారుణంగా ఫ్లాప్ అయ్యింది. ఓపెనింగ్స్ భారీగా వచ్చినా ఓవర్ సెంటిమెంట్ తో జనాలకు నచ్చలేదు. అయినా నాగ్ కు ఈ బ్యానర్ తో ఒక జ్ఞాపకం అలా మిగిలిపోయింది.

టయర్ 2 స్టార్లలో ఉషాకిరణ్ సంస్థ తీసిన వాటిలో రాజశేఖర్ మెకానిక్ మావయ్య, జగపతిబాబు మూడుముక్కలాట, రవితేజ ఒక రాజు ఒక రాణి లాంటివి ఉన్నాయి కానీ విచిత్రంగా ఇవన్నీ ఫ్లాప్ అయినవే కావడం గమనార్హం. అక్కినేని నాగేశ్వరరావుతో డాడీ డాడీ యావరేజ్ గా మిగిలింది. కొత్త వాళ్ళు చిన్న హీరోలతో తీసిన సినిమాలే ఉషాకిరణ్ బ్యానర్లో బ్లాక్ బస్టర్లు, ఇండస్ట్రీ హిట్లు సాధించాయి.