సిద్ధు జొన్నలగడ్డ.. ఇంకోటి ఓకే చేశాడా?

ఈ ఏడాది వేసవిలో బిగ్గెస్ట్ హిట్‌గా నిలిచిన చిత్రం ‘టిల్లు స్క్వేర్’. దానికి దరిదాపుల్లో ఏ చిత్రం కూడా లేదు. ఈ సినిమాకు రిలీజ్ ముంగిటే మంచి హైప్ ఉన్నా సరే.. మరీ వంద కోట్లకు పైగా వసూళ్లు రాబట్టడం అన్నది చిన్న విషయం కాదు. ఈ చిత్రంతో సిద్ధు జొన్నలగడ్డ క్రేజ్ ఇంకా పెరిగిపోయింది. అతను స్టార్ రేంజిని మించిపోయాడు. ప్రస్తుతం టాలీవుడ్లో మోస్ట్ వాంటెడ్ హీరోల్లో అతను ఒకడు అనడంలో సందేహం లేదు. ప్రొడ్యూసర్లయితే బ్లాక్ చెక్స్ ఇచ్చి తనను సినిమాకు బుక్ చేయడానికి రెడీగా ఉన్నారు. పేరున్న దర్శకులు కూడా సిద్ధుతో సినిమా చేయడానికి ఆసక్తి ప్రదర్శిస్తున్నారు.

ఐతే ‘డీజే టిల్లు’ తర్వాత తన వద్దకు చాలా కథలు వచ్చినా ఏ సినిమా పడితే ఆ సినిమా ఒప్పుకోలేదతను. ఫోకస్ అంతా ‘టిల్లు స్క్వేర్’ మీద పెట్టి.. కొంచెం గ్యాప్ తర్వాత జాక్, తెలుసు కదా చిత్రాలను ఓకే చేశాడు. ప్రస్తుతం ఇవి ప్రొడక్షన్ దశలో ఉన్నాయి.

కాగా ‘టిల్లు స్క్వేర్’ తర్వాత సిద్ధు దగ్గరికి చాలా ప్రపోజల్స్ రాగా.. వాటిలోంచి ఎట్టకేలకు ఒక సినిమాను అతను ఓకే చేసినట్లు తెలుస్తోంది. ‘తొలి ప్రేమ’తో దర్శకుడిగా తొలి ప్రయత్నంలోనే మంచి విజయాన్నందుకుని.. గత ఏడాది ‘సార్’తో మెప్పించి.. ప్రస్తుతం దుల్కర్ సల్మాన్‌తో ‘లక్కీ భాస్కర్’ తీస్తున్న వెంకీ అట్లూరితో సిద్ధు జట్టు కట్టబోతున్నాడట. ఇటీవలే సిద్ధుకు వెంకీ ఒక కథ చెప్పి ఓకే చేయించుకున్నట్లు సమాచారం. ‘లక్కీ భాస్కర్’ పూర్తయ్యాక వెంకీ చేసే సినిమా ఇదేనట. ఈలోపు సిద్ధు ‘తెలుసు కద’; ‘జాక్’ చిత్రాలను ఒక కొలిక్కి తెస్తాడు.

సిద్ధు వరుసగా డీజే టిల్లు, టిల్లు స్క్వేర్ చిత్రాలు చేసిన సితార సంస్థకే ఈ సినిమాను కూడా చేయనున్నాడట. ఇదే బేనర్లో వెంకీ వరుసగా రంగ్ దె, సార్ చిత్రాలు చేశాడు. ఇప్పుడు ‘లక్కీ భాస్కర్’ కూడా అందులోనే తీస్తున్నాడు. ఇద్దరికీ మంచి అనుబంధం ఉన్న సంస్థలోనే తమ కాంబినేషన్లో సినిమా చేయడానికి సిద్ధమవుతున్నారట సిద్ధు, వెంకీ.