సేఫ్ గేమ్ ఆడుతున్న ఆర్ఆర్ఆర్ నిర్మాత

ఇండస్ట్రీలో సుదీర్ఘ అనుభవంతో ఎన్నో బ్లాక్ బస్టర్లు చూసిన డివివి దానయ్య సగటు మాములు ప్రేక్షకుడికి బాగా దగ్గరయ్యింది మాత్రం ఆర్ఆర్ఆర్ తోనే. ఎస్ఎస్ రాజమౌళి సృష్టించిన ఈ మల్టీ స్టారర్ మేజిక్ జపాన్ దేశంతో మొదలుపెట్టి ఆస్కార్ వేదిక దాకా ఎన్ని ఘనతలు సాధించిందో చూసాం. మాములుగా ఇతర ప్రొడ్యూసర్ ఎవరైనా తన పేరు మీద వచ్చిన ఈ సక్సెస్ ని పదే పదే హైలైట్ చేసుకునే ప్రయత్నం చేసేవారు. కానీ దానయ్య మాత్రం సైలెంట్ గా తన పనేదో తాను చూసుకుంటూ పవన్ కళ్యాణ్ ఓజి, నాని సరిపోదా శనివారం మీద పూర్తి దృష్టి పెట్టారు. అసలు పాయింటుకొద్దాం.

గత కొంత కాలంగా దానయ్య వదులుకున్న కీలక ప్రోజెక్టుల గురించి ఇండస్ట్రీలో పెద్ద చర్చే జరుగుతోంది. తమిళ స్టార్ హీరో విజయ్ తో ఆయన రాజకీయ ప్రవేశానికి ముందు చివరి సినిమా చేసే ఛాన్స్ ముందు డివివికే దక్కింది. కానీ బడ్జెట్ పరంగా వచ్చే చిక్కులు, రెండు వందల కోట్లకు పైగా ఒక్క హీరో రెమ్యునరేషన్ కే కేటాయించాల్సి రావడం తదితర కారణాలను సీరియస్ గా విశ్లేషించుకుని వద్దనుకున్నారు. అంత ఒత్తిడిని భరించడం కష్టమని గుర్తించి ఉండొచ్చు. నాని సుజిత్ కలయికలో అఫీషియల్ అనౌన్స్ మెంట్ ఇచ్చిన మూవీని సైతం వేరే ప్రొడక్షన్ హౌస్ కి ఇచ్చేందుకు రెడీ అయ్యారు.

ఇదంతా చూస్తే దానయ్య సేఫ్ గేమ్ ఆడేందుకు ప్రాధాన్యం ఇస్తున్నట్టు కనిపిస్తుంది. ఒకేసారి మూడు నాలుగు ప్యాన్ ఇండియా సినిమాలను సెట్ల మీద ఉంచి, క్వాలిటీ, ఖర్చులు రెండూ అదుపు తప్పించుకోవడం కన్నా ఇలా ఒకటి రెండు మీదే ఫోకస్ పెడితే మంచి ఫలితాలు దక్కొచ్చు. ప్రకటించలేదు కానీ నిజానికి ప్రభాస్ రాజా సాబ్ కూడా ముందు దానయ్య చేయాల్సింది. తర్వాత పీపుల్స్ మీడియా ఫ్యాక్టరీకి వెళ్లిందని అంటారు. ఆర్ఆర్ఆర్ లాంటి ఇంటర్నేషనల్ బ్లాక్ బస్టర్ సాధించాక కూడా దానయ్య దూకుడు చూపించకుండా ఇంత నెమ్మదిగా వెళ్లడం చూస్తే నిదానమే ప్రధానం సూత్రం గుర్తొస్తుంది.