థియేట్రికల్ రిలీజ్‌లు లైట్.. ఓటీటీ సినిమాలే హైలైట్

ఏప్రిల్ చివరి వారం అంటే పీక్ సమ్మర్.. ఈ టైంలో పెద్ద పెద్ద సినిమాలతో థియేటర్లు కళకళలాడుతుండాలి. రెండు గంటలు ఏసీలో కూర్చోవచ్చన్న ఉద్దేశంతో అయినా థియేటర్లకు వచ్చేవాళ్లు జనాలు. కానీ ఇప్పుడు కథ మారిపోయింది. జనాలకు థియేటర్ల పట్ల పూర్తిగా ఆసక్తి సన్నగిల్లిపోయి కొత్త సినిమాల వైపే చూడట్లేదు. ప్రేక్షకుల మూడ్ చూసి చెప్పుకోదగ్గ కొత్త చిత్రాలు కూడా రిలీజ్ చేయట్లేదు.

ఈ వారం ‘రత్నం’ అనే అనువాద చిత్రం రిలీజైంది. దాన్ని ప్రేక్షకులు పూర్తిగా లైట్ తీసుకున్నారు. ముందు వారాల్లో వచ్చిన సినిమాలను కూడా పట్టించుకునే పరిస్థితి లేదు. వీకెండ్లో జనాలతో కళకళలాడే థియేటర్లు ఆక్యుపెన్సీలు లేక షోలు క్యాన్సిల్ చేసుకుంటున్నాయి. థియేటర్లకు వెళ్లడం కంటే ఇంట్లో కూర్చుని ఓటీటీల్లో కొత్త చిత్రాలు చూడడానికే ప్రేక్షకులు ప్రాధాన్యం ఇస్తున్నారు.

నిన్ననే మూడు పేరున్న చిత్రాలు ఓటీటీల ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. అందులో ‘టిల్లు స్క్వేర్’ థియేటర్లలో మాదిరే ఓటీటీలోనూ హవా సాగిస్తోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ సినిమాను జనాలు ఎగబడి చూస్తున్నారు. సినిమా రిలీజైన దగ్గర్నుంచి సోషల్ మీడియాలో కూడా టిల్లు హడావుడే నడుస్తోంది. ఇక విజయ్ దేవరకొండ సినిమా ‘ఫ్యామిలీ స్టార్’ అమేజాన్ ప్రైమ్ ద్వారా రిలీజ్ కాగా.. దాన్ని కూడా జనం బాగానే చూస్తున్నారు. చూసి సోషల్ మీడియాలో విపరీతంగా ట్రోల్ చేస్తున్నారు. ఫ్లాప్ సినిమాలను డబ్బులు పెట్టి థియేటర్లకు వెళ్లి చూడ్డానికి వెనుకంజ వేస్తారు కానీ.. ఓటీటీలో ఫ్రీగా చూడ్డానికేమీ ఇబ్బంది ఉండదు.

అసలెందుకీ సినిమా ఫ్లాప్ అయింది, ట్రోల్స్ బారిన పడింది అని అయినా చూస్తారు. అలాగే ‘ఫ్యామిలీ స్టార్’ను చూస్తున్నట్లున్నారు. మరో ఫ్లాప్ మూవీ ‘భీమా’కు సైతం హాట్ స్టార్‌లో బాగానే వ్యూయర్‌షిప్ వస్తున్నట్లుంది. త్వరలో విడుదల కానున్న ‘మంజుమ్మల్ బాయ్స్’ కోసం జనం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.