నెగిటివ్ ట్రైలర్ కొంప ముంచింది

ఒక సినిమాని మార్కెట్ చేయడంలో అంచనాలు పెంచడంలో ట్రైలర్ పాత్ర చాలా కీలకం. దీని వల్లే ఒక్కోసారి బిజినెస్ లెక్కలు అమాంతం పెరిగిపోతాయి. బాహుబలి, ఆర్ఆర్ఆర్ విషయంలో రాజమౌళి అంత శ్రద్ధ తీసుకోబట్టే రిలీజ్ ముందు నుంచే హైప్ ని రెట్టింపు చేశాయి. ఒకవేళ తేడా కొడితే ఏం జరుగుతుందనే దానికి బాలీవుడ్ మూవీ బడేమియా చోటే మియా నిలుస్తోంది. వాస్తవానికి ఏప్రిల్ 10 విడుదల కావాల్సిన ఈ యాక్షన్ మల్టీస్టారర్ ఇప్పుడు ఒకరోజు వాయిదా పడి ఏప్రిల్ 11 రానుంది. కారణం ఏంటయ్యా అంటే ఆశించిన దానికి చాలా తక్కువగా అడ్వాన్స్ బుకింగ్స్ ఉండటం.

రంజాన్ పండగ ఏప్రిల్ 11 రానుంది. ఉపవాస దీక్షలు పూర్తి చేసుకుని ముస్లింలు ఆ రోజు నుంచి థియేటర్లకు వస్తారు. ఒకవేళ 10నే బడేమియా చోటేమియాకు నెగటివ్ టాక్ వస్తే అక్కడితో ఖేల్ ఖతం. సమస్యల్లా రొటీన్ గా అనిపించినా ట్రైలర్ వల్ల జరిగిందని విశ్లేషకులు తేల్చి చెబుతున్నారు. ఎలాంటి కొత్తదనం ఫీలవ్వకుండా అక్షయ్ కుమార్, టైగర్ శ్రోఫ్ ఉంటే చాలానే ధీమాతో రెగ్యులర్ ఎలిమెంట్స్ తో నింపేయడం వల్ల బజ్ తెచ్చుకోవడంలో విఫలమయ్యిందని అభిప్రాయపడుతున్నారు. పైగా సలార్ ఫేమ్ పృథ్విరాజ్ సుకుమారన్ నటించిన పాయింట్ ని కూడా సరిగా పబ్లిసిటీ చేయలేకపోయారు.

దీంతో అడ్వాన్ బుకింగ్స్ చూసి డీలా పడిపోయిన నిర్మాతలు వాయిదా మార్గం పట్టారు. ఇదే కాదు మైదాన్ కూడా ఇదే దారిలో వన్ డే పోస్ట్ పోన్ ఆలోచన చేస్తోందని సమాచారం. ఎంతసేపూ పాకిస్థాన్ తీవ్రవాదాన్ని పట్టుకుని ఒకే కథను తిప్పి తిప్పి తీస్తే ఆడియన్స్ లో ఆసక్తి ఎక్కడ నుంచి వస్తుంది. సల్మాన్ ఖాన్ టైగర్ 3 దెబ్బ తింది, థియేటర్లలో ఫైటర్ యావరేజ్ అయ్యింది ఇందుకే కదా. మరి బడేమియా చోటేమియా కూడా అదే దారి పడితే ఇంతకన్నా రెస్పాన్స్ ఏమొస్తుంది. అన్నట్టు ఈ సినిమా తెలుగులో కూడా డబ్బింగ్ రూపంలో విడుదలవుతున్న సంగతి జనాలకు నిజంగా తెలుసంటారా