రివ్యూలు మూడు రోజులు ఆపాలి-దిల్ రాజు

సినిమా స‌మీక్ష‌ల మీద ఇండ‌స్ట్రీ నుంచి నిర‌స‌న వ్య‌క్తం కావ‌డం కొత్తేమీ కాదు. సినిమాకు టాక్ బాలేక‌, క‌లెక్ష‌న్ల విష‌యంలో ఇబ్బంది ప‌డుతున్న‌పుడు అస‌హ‌నంతో టీం స‌భ్యులు రివ్యూల‌ను త‌ప్పుబ‌ట్ట‌డం చాలా కాలం నుంచి జ‌రుగుతున్న‌దే. ఇప్పుడు అగ్ర నిర్మాత దిల్ రాజు సైతం ఈ జాబితాలో చేరారు. త‌న ప్రొడ‌క్ష‌న్లో వ‌చ్చిన కొత్త చిత్రం ఫ్యామిలీ స్టార్‌కు పూర్తిగా నెగెటివ్ టాక్ రావ‌డం.. తొలి రోజు ప‌ర్వాలేద‌నిపించిన ఈ సినిమాకు రెండో రోజు వ‌సూళ్లు బాగా డ్రాప్ కావ‌డంతో రాజు హర్ట‌యిన‌ట్లున్నారు. రిలీజ్ రోజు రివ్యూల‌ను తాను అంగీక‌రిస్తాన‌ని.. కానీ రివ్యూల‌తో పోలిస్తే ప‌బ్లిక్ టాక్ చాలా బాగుంద‌ని సానుకూల ధోర‌ణిలో మాట్లాడిన రాజు.. త‌ర్వాత స్వ‌రం మార్చారు.

సినిమా స‌మీక్ష‌ల‌ను మూడు రోజుల పాటు ఆపాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తాజాగా రాజు అభిప్రాయ‌ప‌డ్డారు. కేర‌ళ‌లో మూడు రోజుల పాటు సినిమా స‌మీక్ష‌లు ఆపాలంటూ ఓ నిర్మాత కోర్టుకెక్క‌డం, ఆ విష‌యంలో కోర్టు సానుకూలంగా స్పందించిన విష‌యాన్ని ఉటంకిస్తూ.. మ‌న ద‌గ్గ‌ర కూడా ఆ ప‌రిస్థితి రావాల్సిన అవ‌స‌రం ఉంద‌ని ఆయ‌నన్నారు. అలా చేస్తే త‌ప్ప ఇండ‌స్ట్రీ బాగుప‌డ‌ద‌ని.. రివ్యూలు సినిమాల ఫ‌లితాల‌ మీద తీవ్ర ప్ర‌భావం చూపుతున్నాయ‌ని రాజు ఆవేద‌న వ్య‌క్తం చేశారు.

స‌మీక్ష‌ల వ‌ల్ల ప్రేక్ష‌కులు థియేట‌ర్ల‌కు రావ‌ట్లేద‌ని.. నెగెటివిటీ స్ప్రెడ్ చేసి సినిమాను దెబ్బ తీస్తున్నార‌ని ఆయ‌న అన్నారు. సినిమా మీద ఎవ‌రైనా అభిప్రాయం చెప్పొచ్చ‌ని.. అది వారి వ్య‌క్తిగ‌త‌మ‌ని.. కానీ ప్రేక్ష‌కుల మీద ఆ అభిప్రాయాన్ని రుద్ది థియేట‌ర్ల‌కు రాకుండా చేయ‌డం క‌రెక్ట్ కాద‌ని రాజు చెప్పారు. ప‌రిస్థితి ఇలాగే కొన‌సాగితే నిర్మాత‌లు ఇండ‌స్ట్రీలో కొన‌సాగ‌డం క‌ష్ట‌మ‌ని.. సినిమాలు తీయ‌డం ఎందుకులే అని ఊరుకుంటార‌ని.. అప్పుడు ఇండ‌స్ట్రీకే న‌ష్ట‌మ‌ని రాజు అభిప్రాయ‌ప‌డ్డారు.