సీనియర్ స్టార్ హీరోలకు రంజాన్ పరీక్ష

మాములుగా రంజాన్ పండక్కు తన కొత్త సినిమా ఉండేలా ప్లాన్ చేసుకుంటాడు కండల వీరుడు సల్మాన్ ఖాన్. ఎంత డిజాస్టర్ పడ్డా సరే మంచి వసూళ్లు దక్కించుకునే అడ్వాంటేజ్ ఈ ఒక్క సీజన్ లోనే ఉంటుంది. కానీ ఈసారి సాధ్యం కాలేదు. టైగర్ 3 దెబ్బకు బాగా నెమ్మదించి నిర్మాణంలో ఉన్నవి కూడా స్లో చేశాడు. తనకు మిస్ అయినా మరో ఇద్దరు సీనియర్లు తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు రెడీ అవుతున్నారు. అజయ్ దేవగన్ మైదాన్ ఎన్నో పురిటి నొప్పులు పడి వాయిదాలు వేసుకుంటూ ఏళ్ళ తర్వాత థియేటర్ మోక్షం దక్కించుకోబోతోంది.

నిజానికి మైదాన్ రెండేళ్ల క్రితం ఆర్ఆర్ఆర్ తో పాటుగా రిలీజ్ కావాల్సింది. కానీ నిర్మాత బోనీ కపూర్ ఆర్థిక కారణాల వల్ల ఆపేశారు. తర్వాత కుదురుకోవడంతో క్రమంగా ల్యాబు నుంచి బయటికి తీసుకొచ్చారు. ప్రముఖ ఫుట్ బాల్ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీం బయోపిక్ గా రూపొందిన మైదాన్ ఏప్రిల్ 10 రానుంది. ప్రియమణి హీరోయిన్. అదే రోజు బడేమియా చోటేమియాని దింపుతున్నారు. ఎన్ని ఫ్లాపులు వచ్చినా సరే వేగం తగ్గించకుండా దూసుకుపోతున్న అక్షయ్ కుమార్ తో పాటు మాస్ లో పట్టున్న టైగర్ శ్రోఫ్ హీరోలుగా నటించారు. ప్రమోషన్లు గట్రా బాగానే చేస్తున్నారు కానీ ప్రీ రిలీజ్ బజ్ తక్కువగా ఉంది.

సలార్ ఫేమ్ పృథ్విరాజ్ సుకుమారన్ మెయిన్ విలన్ గా నటించడం బిజినెస్ పరంగా హెల్ప్ అవుతుందని నిర్మాతలు భావిస్తున్నారు. ఈ రెండూ ఉపవాస దీక్ష పూర్తి చేసుకున్న ముస్లిం ప్రేక్షకులకు మంచి ఆప్షన్లు అవుతాయని బయ్యర్ల నమ్మకం. ఓపెనింగ్స్ అండ్ టాక్ ని బట్టి బాక్సాఫీస్ ని అంచనా వేయాల్సి ఉంటుంది. గత కొంత కాలంగా హిందీలో సరైన కిక్ ఇచ్చిన హిట్ సినిమా రాలేదు. సైతాన్, క్రూలు తక్కువ బడ్జెట్, బిజినెస్ తో బయ్యర్లను సంతోషపెట్టాయి కానీ రికార్డులు బద్దలు కొట్టే బొమ్మ కోసం ఎదురు చూస్తున్నారు. మరి అక్షయ్, అజయ్ ఇద్దరిలో ఎవరు టార్గెట్ అందుకుంటారో చూడాలి.