రెహమాన్ తో చేతులు కలపనున్న హాలీవుడ్ దిగ్గజం

లెజెండరీ సంగీత దర్శకుడు ఏఆర్ రెహమాన్ బాలీవుడ్ రామాయణానికి సంగీతం సమకూర్చబోతున్న వార్త మ్యూజిక్ లవర్స్ ని ఊపేస్తోంది. ఇలాంటి ఎపిక్ మూవీకి ఆయన మాత్రమే న్యాయం చేస్తాడని ఆనందపడుతున్నారు. అయితే అసలు న్యూస్ ఇది కాదు. హాలీవుడ్ సుప్రసిద్ధ దిగ్గజం హన్స్ జిమ్మర్ తో కలిసి కంపోజింగ్ చేయబోతున్నారు. రెగ్యులర్ గా ఇంగ్లీష్ సినిమాలు చూసేవాళ్లకు హన్స్ ఎవరో అవగాహన ఉంటుంది. నలభై ఏళ్ళ సుదీర్ఘ అనుభవమున్న ఈ మ్యుజిషియన్ 1982 మూన్ లైటింగ్ నుంచి మొన్న వచ్చిన కుంగ్ ఫూ పాండా 4 దాకా ఎన్నో బ్లాక్ బస్టర్లకు అద్భుతమైన స్కోర్ ఇచ్చారు.

క్రిస్టోఫర్ నోలన్, మైకేల్ బే, జాక్ సిండర్, డెన్నిస్ విల్లేన్యూ లాంటి ఎందరో విఖ్యాత డైరెక్టర్లతో పని చేసిన ట్రాక్ రికార్డు ఆయన సొంతం. ముఖ్యంగా ఇన్సెప్షన్, డంక్ రిక్, టాప్ గన్ మావెరిక్ లాంటి వాటికి ఆయన పనితనం వాటి సక్సెస్ లో ఎంతగానో దోహదపడింది. ఇప్పటిదాకా హన్స్ జిమ్మర్ భారతీయ సినిమాలకు సంగీతం ఇవ్వలేదు. అయితే నితీష్ తివారి ఏం చెప్పి ఒప్పించారో లేక రెహమాన్ చొరవ తీసుకుని ఈ కాంబో కుదిరేలా చేశారో తెలియదు కానీ మొత్తానికి గొప్ప కలయికకు శ్రీకారం చుట్టారు. మూడు భాగాల రామాయణం కోసం ఇద్దరూ కలిసి పని చేయబోతున్నారు.

ప్రాజెక్టు ఇంకా అధికారికంగా ప్రకటించనప్పటికీ ప్రీ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నాయి. రన్బీర్ కపూర్, యష్ ల బాడీ డబుల్స్ తో కొన్ని గ్రాఫిక్స్ ఉన్న సన్నివేశాలు ఆల్రెడీ తీస్తున్నట్టు తెలిసింది. మెయిన్ క్యాస్టింగ్ త్వరలోనే సెట్లో అడుగు పెట్టబోతున్నారు. ఈ నెల 17 శ్రీరామనవమి పండగ సందర్భంగా అనౌన్స్ మెంట్ వచ్చే అవకాశముంది. సాయిపల్లవి, రకుల్ ప్రీత్ సింగ్, సన్నీ డియోల్ లాంటి క్రేజీ క్యాస్టింగ్ తో రూపొందనున్న ఈ ఇతిహాసగాథలో నవీన్ పోలిశెట్టి లక్ష్మణుడిగా నటింపజేసే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఫస్ట్ పార్ట్ రిలీజ్ 2025 చివర్లో ఉండొచ్చట.