సావిత్రి జ్ఞాపకాలతో చిరంజీవి భావోద్వేగం

ఇప్పటి తరానికి అంతగా తెలియని సావిత్రి గారి గురించి మహానటిలో దర్శకుడు నాగ అశ్విన్ అద్భుతంగా ఆవిష్కరించాక జనరేషన్స్ తో సంబంధం లేకుండా ఆ పేరు అందరికీ కనెక్టయిపోయింది. ఒక యాక్టర్ ఎలా ఉండాలనే మాటకు అర్థం ఆవిడ సినిమాలని చెప్పుకోవచ్చు. అలాంటి లెజెండరీ హీరోయిన్ తో మెగాస్టార్ చిరంజీవికి ఎంత ఎమోషనల్ కనెక్షన్ ఉందో నిన్న జరిగిన సావిత్రి క్లాసిక్స్ అనే బుక్ లాంచ్ లో బయట పడింది. సంజయ్ కిషోర్ రచించిన ఈ పుస్తవిష్కరణకు బ్రహ్మానందం, మురళీమోహన్, జయసుధ లాంటి ఎందరో సీనియర్లు అతిథులుగా హాజరయ్యారు.

సావిత్రి కుమార్తె విజయ చాముండేశ్వరి చెప్పాకే కొన్ని కీలక విషయాలు బయట పడ్డాయి. ఈ కార్యక్రమం గురించి చెప్పడానికి వెళ్ళినప్పుడు కాలికి ఏదో చిన్న సర్జరి వల్ల స్టిక్ తో నడుస్తున్న చిరంజీవి రోజూ లేవగానే మీ అమ్మగారి ఫోటోనే చూస్తానంటూ ఆ చిత్రపటాన్ని ఏకంగా తీసుకొచ్చి మరీ చూపించిన జ్ఞాపకాన్ని పంచుకున్నారట. అంతే కాదు ఏదో సింపుల్ గా కానివ్వాల్సిన ఈ ప్రోగ్రాంకి అంతా తానై వ్యవహారించి బ్రహ్మానందం లాంటి వాళ్ళకు ఫోన్ చేసి మరీ స్వయంగా పిలవడం లాంటివన్నీ ఆయనే చేశారు. సావిత్రి గారికి పెద్దబ్బాయి ఉంటే ఇంతకన్నా చేసేవారు కాదని ఆవిడ చెప్పడం కదిలించింది.

చిరంజీవి సైతం పునాదిరాళ్లు, ప్రేమ తరంగాలు సినిమాల్లో సావిత్రి గారితో నటించిన అనుభవాన్ని పంచుకుంటూ, షూటింగ్ స్పాట్ లో తన డాన్సులు చూసి గొప్ప హీరో అవుతావని ఆశీర్వదించారని, ఇప్పుడు ఆ స్థాయికి చేరుకోవడం వెనుక ఆ మహానటి స్ఫూర్తి ఎంతో ఉందని గుర్తు చేసుకున్నారు. కళ్ళతోనే నటించే శక్తి సావిత్రి గారిలో చూశానని, మరొకరు అలా పుట్టడం చేయడం జరగదని అన్నారు. ఈవెంట్ ఉద్దేశం పుస్తకమే అయినా గెస్టులు సావిత్రి గారితో తమకున్న అరుదైన జ్ఞాపకాలను గెస్టులు పంచుకున్నారు. విశ్వంభర షూటింగ్ బిజీగా జరుగుతున్న టైంలోనూ మూడు రోజుల గ్యాప్ లో చిరు హాజరైన రెండో ఈవెంట్ ఇది.