సెన్సార్ దిగ్బంధనంలో కోతి మనిషి సినిమా

పదిహేడేళ్ల క్రితం వచ్చిన స్లండాగ్ మిలియనీర్ గుర్తుందా. ఏఆర్ రెహమాన్ కు ఆస్కార్ తెచ్చిన సినిమాగానే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో పేరు తెచ్చుకున్న మూవీగా ఎన్నో విశేషాలున్నాయి. ఇందులో చైల్డ్ ఆర్టిస్ట్ గా నటించిన దేవ్ పటేల్ ఇప్పుడు హీరో అయ్యాడు. మంకీ మ్యాన్ పేరుతో ఒక హాలీవుడ్ మూవీ తీసి గత మార్చి 12 ఎస్ఎక్స్ఎస్డబ్ల్యు ఈవెంట్ లో రిలీజ్ చేశాడు. విమర్శకులు మెచ్చుకున్నారు. పలు చిత్రోత్సవాల్లో స్టాండింగ్ ఒవేషన్ దక్కింది. గొప్పగా తీశావని ఇంటర్నేషనల్ ఫిలిం మేకర్స్ శబాషన్నారు. యుఎస్ లో ఏప్రిల్ 5, మన దేశంలో ఏప్రిల్ 19 విడుదల చేయాలని నిర్ణయించుకున్నారు.

కానీ సెన్సార్ చిక్కుల వల్ల ఇండియాలో ఆలస్యమయ్యేలా ఉందని లేటెస్ట్ అప్డేట్. ఇందులో గూఢచారి ఫేమ్ శోభిత ధూళిపాళ ఒక ముఖ్యమైన పాత్రని చేసింది. తల్లిని హత్యకు కారణమైన వాళ్ళను అంతమొందించేందుకు హనుమంతుడిని స్ఫూర్తిగా తీసుకుని రంగంలోకి దిగే ఓ యువకుడి కథే మంకీ మ్యాన్. వ్యవస్థలోని లోపాలు, దాన్ని అడ్డం పెట్టుకుని పలువురు అధికారులు చేసే దారుణాలు అన్ని కళ్లకు కట్టినట్టు చూపించాడు. మతాల సెంటిమెంట్స్ ని దెబ్బ తీసే విధంగా కొన్ని సన్నివేశాలు ఉన్నాయని, వాటి పట్ల సెన్సార్ అభ్యంతరం వ్యక్తం చేస్తోందని ఇన్ సైడ్ న్యూస్.

అందుకే ఏప్రిల్ 26కి వాయిదా వేస్తారట. పెద్దలను దోచి పేదలకు పంచి పెట్టే కాన్సెప్ట్ ని తీసుకున్న దేవ్ పటేల్ అభ్యంతరం అనిపించే సీన్లు గట్టిగానే పెట్టాడు. కీలక నిర్మాణ భాగస్వామి అయిన యునివర్సల్ పిక్చర్స్ సెన్సార్ చెప్పిన కత్తిరింపులు, మ్యుట్లు, మార్పులకు ఒప్పుకుంటేనే మంకీ మ్యాన్ మన దేశంలో అడుగు పెడుతుంది. లేదూ ఛేంజ్ చేసే ప్రసక్తే లేదంటే ఎవరేం చేయలేరు ఓటిటిలో చూసుకోవడం తప్ప. శోభిత ధూళిపాళ మాత్రం ఫలితం పట్ల కాన్ఫిడెంట్ గా ఉంది. మన ఆడియన్స్ సైతం ఆదరిస్తారని నమ్మకం వ్యక్తం చేస్తోంది. డబ్బింగ్ వెర్షన్లు కూడా సిద్ధం చేస్తారట.