కమల్‌తో శింబు సినిమా

kamal simbu

కోలీవుడ్లో ఎప్పుడూ ఏదో ఒక వివాదంతో సహవాసం చేస్తూ ఉండే హీరో శింబు. ఒక దశ దాటాక అతడి వ్యవహారాలు శ్రుతి మించి పోయి అతడి సినిమాలు మధ్యలో ఆగిపోవడం, విడుదలకు నోచుకోకపోవడం, కమిటైన సినిమాలు పట్టాలెక్కకుండానే క్యాన్సిల్ అయిపోవడం.. ఇలా తయారైంది పరిస్థితి.

శింబు నుంచి ఒక హిట్ సినిమా వచ్చి కూడా చాలా కాలం అయిపోయింది. చివరగా అతను చేసిన ‘అత్తారింటికి దారేది’ రీమేక్ ‘వందా రాజాదా వరువేన్’ డిజాస్టర్ అయింది. ప్రస్తుతం అతను వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘మానాడు’ అనే సినిమా చేస్తున్నాడు. లాక్ డౌన్ వల్ల దానికీ బ్రేక్ పడింది. కాగా ఇప్పుడు శింబు ఓ అరుదైన కాంబినేషన్లో సినిమా చేయడానికి రెడీ అయినట్లు వార్తలొస్తున్నాయి. లెజెండరీ నటుడు కమల్ హాసన్‌తో కలిసి శింబు నటించనున్నాడట.

కమల్ కెరీర్లో చాలా ప్రత్యేకంగా చెప్పుకోదగ్గ చిత్రాల్లో ‘సిగప్పు రోజాక్కల్’ ఒకటి. తెలుగులో ‘ఎర్ర గులాబీ’లు పేరుతో రిలీజై ఇక్కడా సూపర్ హిట్టయిందా చిత్రం. సైకో కిల్లర్ రామన్ రాఘవ్ జీవిత కథ ఆధారంగా భారతీ రాజా ఈ చిత్రాన్ని తెరకెక్కించాడు. 80ల్లో సెన్సేషన్ క్రియేట్ చేసిన ఈ సినిమా స్ఫూర్తితో శింబు ‘మన్మథన్’ అనే సినిమా చేశాడు. తెలుగులో అది ‘మన్మథ’ పేరుతో రిలీజైంది. రెండు చోట్లా ఆ సినిమా సూపర్ హిట్. శింబు కెరీర్లో అతి పెద్ద విజయం అదే. ఇప్పుడు శింబు ‘సిగప్పు రోజాక్కల్’కు సీక్వెల్ చేయబోతున్నాడట.

ఇందులో కమల్ కూడా ఓ కీలక పాత్రలో నటించనున్నాడట. ఒరిజినల్‌కు కొనసాగింపులా ఆయన పాత్ర ఉంటుందట. భారతీ రాజా తనయుడు, నటుడు అయిన మనోజ్ భారతి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తాడట. ఐతే కమల్ ప్రస్తుతం ‘ఇండియన్-2’ పూర్తి చేయాల్సి ఉంది. ఆ తర్వాత ఎన్నికల్లో బిజీ అవుతాడు. ఆ తర్వాత శింబుతో కలిసి ‘సిగప్పు రోజాక్కల్’ సీక్వెల్లో నటించే అవకాశముంది.