డబుల్ ఇస్మార్ట్ చిక్కులు తీరిపోయాయా

ఎనర్జిటిక్ స్టార్ రామ్ దర్శకుడు పూరి జగన్నాధ్ కాంబోలో వచ్చిన బ్లాక్ బస్టర్ ఇస్మార్ట్ శంకర్ కు సీక్వెల్ గా రూపొందుతున్న డబుల్ ఇస్మార్ట్ మార్చి నుంచి వాయిదా వేసుకున్నాక కొత్త రిలీజ్ డేట్ ఎప్పుడనే దాని గురించి సరైన క్లారిటీ ఇప్పటిదాకా లేదు. చాలా కాలంగా పూరి సోషల్ మీడియాలో యాక్టివ్ గా లేకపోవడంతో అప్డేట్స్ లేవు. ఛార్మీ సైతం సైలెంట్ గానే ఉంది. అసలు ఈ ప్రాజెక్ట్ వేసవిలో వస్తుందా రాదనే అనుమానాలు ఫ్యాన్స్ లో తలెత్తాయి. మ్యూజిక్ డైరెక్టర్ విషయంలో కూడా బాగా నాన్చి రకరకాల ఆప్షన్లు చూసి ఫైనల్ గా మణిశర్మని తీసుకున్న సంగతి తెలిసిందే.

తాజాగా వినిపిస్తున్న సమాచారం మేరకు డబుల్ ఇస్మార్ట్ జూన్ విడుదలకు రెడీ అవుతోంది. వేసవి కోణంలో చూసుకుంటే కొంత ఆలస్యంగా అనిపిస్తున్నా బ్యాలన్స్ ఉన్న షూటింగ్, పోస్ట్ ప్రొడక్షన్ పనులకు ఆ మాత్రం సమయం అవసరమే అంటున్నారు. ప్రస్తుతం మణిశర్మ నేతృత్వంలో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కు సంబంధించిన పనులు జరుగుతున్నాయని తెలిసింది. షూట్ చేసిన భాగానికి రీ రికార్డింగ్ పూర్తి చేయిస్తే ఒత్తిడి తగ్గుతుందనే ఉద్దేశంతో ఇలా ప్లాన్ చేసుకున్నారట. ఇందులో రామ్ డ్యూయల్ రోల్ చేస్తున్నాడనే లీక్ ఉంది కానీ దానికి సంబంధించిన ఇన్ఫో పక్కాగా లేదు.

ఇటీవలే ఒక ప్రైవేట్ వేడుకకు హాజరైన సందర్భంగా అభిమాని అడిగిన ప్రశ్నకు రామ్ జూన్ రిలీజని చెప్పిన సమాధానం ఇంకా బలం చేకూరుస్తోంది. సంజయ్ దత్ విలన్ గా నటిస్తున్న డబుల్ ఇస్మార్ట్ లో ఈసారి ఎలాంటి నార్త్ ఫ్లేవర్ లేకుండా పూరి జాగ్రత్తలు తీసుకున్నట్టు తెలిసింది. సుకుమార్, రాజమౌళి లాంటి వాళ్ళు నేటివిటీ వదలకుండానే ఉత్తరాది ప్రేక్షకులను మెప్పిస్తున్నప్పుడు తాను మాత్రం ఎందుకు బాలీవుడ్ టచ్ కోసం పాకులాడాలని భావించి పక్కా లోకల్ మాస్ టచ్ ఇచ్చారట. వరస డిజాస్టర్ల తర్వాత రామ్ కు ఈ సినిమా బ్లాక్ బస్టర్ కావడం చాలా అవసరం.