టాలీవుడ్ యువతకు కొత్త క్రష్ దొరికింది

మల్లు వుడ్ బ్యూటీలు అందంలోనే కాదు అభినయంలోనూ మనకు త్వరగా కనెక్ట్ అయిపోతారు. అందుకే కెరీర్ మొదలుపెట్టిన అర దశాబ్దం తర్వాత కూడా సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్ లాంటి వాళ్ళు టాలీవుడ్ లో ఇప్పటికీ బిజీగా అవకాశాలు దక్కించుకుంటున్నారు. వీళ్లకు ఫాలోయింగ్ ఎక్కువే. ఈ లిస్టులో ప్రేమలు పుణ్యమాని మమిత బైజు చేరిపోయింది. ఇటీవలే విడుదలైన ఈ యూత్ ఫుల్ లవ్ స్టోరీ ఓపెనింగ్ చాలా నెమ్మదిగా మొదలైనా క్రమంగా ఊపందుకుంది. రాజమౌళి, మహేష్ బాబు ప్రశంసలు అందుకున్నాక ట్రెండింగ్ లో మార్పు రావడం బుకింగ్స్ లో కనిపిస్తోంది.

ఇప్పుడు మమిత బైజు తెలుగు యువతకు కొత్త కృష్ గా మారిపోయింది. ఈమె నేపథ్యం గురించి ఆరా తీస్తున్నారు. మమిత ఇండస్ట్రీకి ఏడేళ్ల క్రితం 2017లో సర్వోపారి పలక్కారన్ తో ఎంట్రీ ఇచ్చింది. ఈమెది కేరళ రాష్ట్రం కొట్టాయం జిల్లా కిడంగూర్ స్వంత ఊరు. తండ్రి బైజు కృష్ణన్ వైద్యుడు. మిథున్ అనే తమ్ముడు ఉన్నాడు. 2021లో ఆపరేషన్ జావాతో మొదటి బ్రేక్ అందుకోగా మరుసటి ఏడాది సూపర్ శరణ్య తనలో పర్ఫార్మర్ ని బయటికి తీసుకొచ్చింది. ప్రణయ విలాసంతో ప్రశంసలు, అవార్డులు దక్కాయి. ఇవన్నీ స్వంత భాషలో తప్ప ఇతర చోట్ల గుర్తింపు తేలేదు. కారణం డబ్బింగ్ చేయకపోవడం వల్లే.

ప్రేమలు వల్ల తెలుగులోనూ ఇంత ఆదరణ దక్కడం చూసి మమిత బైజు ఉబ్బితబ్బిబ్బు అయిపోతోంది. ఇటీవలే హైదరాబాద్ లో థియేటర్లో రెస్పాన్స్ చూసి కారులో కన్నీళ్లు పెట్టుకున్నంత పని చేసింది. ప్రమోషన్ల కోసం ఎలాగూ కొన్ని రోజులు ఇక్కడే ఉంటోంది కాబట్టి పలువురు దర్శకులు నిర్మాతలు మంచి కథలతో భారీ మొత్తం ఆఫర్ చేశారట. ప్రస్తుతం తమిళంలో మమిత నటించిన రెబెల్ విడుదలకు సిద్ధంగా ఉంది. జివి ప్రకాష్ హీరోగా నటించాడు. మమిత వల్ల దీన్ని డబ్బింగ్ చేసే ఆలోచనలో ఉన్నారు. రాజమౌళి అన్నట్టు సాయిపల్లవి తర్వాత మనకు బెస్ట్ ఛాయస్ మమితనే అవుతుందేమో.