అనుష్క ఫ్యాన్స్.. ఫుల్ ఖుషీ

Anushka

సౌత్ ఇండియాలో హీరోలతో సమానంగా ఫ్యాన్ ఫాలోయింగ్, మార్కెట్ ఉన్న హీరోయిన్లలో అనుష్క శెట్టి ఒకరు. కెరీర్ ఆరంభంలో సగటు గ్లామర్ హీరోయిన్ లాగే కనిపించినా.. ‘అరుంధతి’ నుంచి ఆమె ఇమేజ్ మారిపోయింది. దాంతో పాటు రుద్రమదేవి, భాగమతి లాంటి లేడీ ఓరియెంటెడ్ చిత్రాలతో అనుష్క వేరే స్టార్ హీరోయిన్లకు అందనంత ఎత్తులో నిలిచింది.

ఐతే కెరీర్ గొప్పగా సాగుతున్న సమయంలో ‘సైజ్ జీరో’ అనే ప్రయోగాత్మక చిత్రం చేయడం అనుష్క కెరీర్‌ను దెబ్బ తీసింది. ఆ సినిమా కోసం విపరీతంగా బరువు పెరిగి స్థూలకాయురాలిగా కనిపించింది అనుష్క. ఐతే దాని వల్ల సినిమాకు ఉపయోగం లేకపోయింది. ఆ సినిమా ఆడలేదు. దీనికి తోడు అనుష్క లుక్ తేడా కొట్టి.. ఏళ్లు గడిచినా పూర్వపు రూపంలోకి రాలేకపోయింది. ఈ దెబ్బకు ఆమె సినిమాలు కూడా తగ్గించుకోవాల్సి వచ్చింది. ఐదేళ్ల వ్యవధిలో నిశ్శబ్దం, మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి చిత్రాలు మాత్రమే చేసింది అనుష్క.

వీటిలో ‘మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి’ సక్సెస్ అయినా.. అనుష్క లుక్స్ విషయంలో నెగెటివ్ కామెంట్సే వినిపించాయి. ఆమె లుక్ నేచురల్‌గా లేదని, అందులో టెక్నాలజీ టచ్ కనిపించిందని అన్నారు ఫ్యాన్స్. లుక్స్ సంగతి ఎలా ఉన్నా అనుష్క చాన్నాళ్ల తర్వాత తెరపై కనిపించింది, సినిమా కూడా సక్సెస్ అయింది కాబట్టి ఫ్యాన్స్ హ్యాపీనే. కాగా అనుష్క ఇటీవలే క్రిష్ దర్శకత్వంలో ఒక లేడీ ఓరియెంటెడ్ సినిమా మొదలుపెట్టిన సంగతి తెలిసిందే.

ఈ సినిమా సెట్స్ నుంచి తాజాగా అనుష్క ఫొటోలు బయటికి వచ్చాయి. అందులో అనుష్క నాజూగ్గా, ఆకర్షణీయంగా కనిపిస్తోంది. ఆమె ఒకప్పటి లుక్స్‌ గుర్తుకు వస్తోంది. ‘మిస్ శెట్టి..’ రిలీజ్ టైంలో ప్రమోషన్లలో కూడా కనిపించని అనుష్క.. ఇప్పుడిలా ఫొటోలు దిగిందంటే తన పూర్వపు రూపం సంతరించుకున్నట్లే. ఈ లుక్‌లో క్రిష్ లాంటి అభిరుచి ఉన్న దర్శకుడితో మంచి లేడీ ఓరియెంటెడ్ మూవీ చేస్తే దానికి మంచి ఫలితం వస్తుందనడంలో సందేహం లేదు.