25 సంవత్సరాల దేవి మైలురాళ్ళు

కొన్ని సినిమాలు తీసేటప్పుడు రిస్క్ అనిపించినా వాటి బాక్సాఫీస్ ఫలితాలు ఎప్పటికీ గుర్తుండిపోయేలా చేస్తాయి. 1999లో విడుదలై ఈ రోజుతో పాతిక సంవత్సరాలు పూర్తి చేసుకున్న దేవి వెనుక పలు ఆసక్తికరమైన సంగతులున్నాయి. అవేంటో చూద్దాం. ప్రముఖ నిర్మాత ఎంఎస్ రాజు వెంకటేష్ శత్రువు, విజయశాంతి పోలీస్ లాకప్ రెండు వరస సూపర్ హిట్స్ మంచి ఊపుమీదున్న సమయమది. మూడో చిత్రంగా బి గోపాల్ తో స్ట్రీట్ ఫైటర్ 1995 తీస్తే దారుణంగా బోల్తా కొట్టి నష్టాలు తెచ్చి పెట్టింది. స్టార్ పవర్ ఓపెనింగ్స్ తెస్తాయి తప్పించి లాభాలు ఇవ్వవని గుర్తించి మూడేళ్ళ పాటు నిర్మాణానికి దూరంగా ఉన్నారు.

తన బ్యానర్ కు ఆస్థాన దర్శకుడిగా గొప్ప విజయాలు అందించిన కోడి రామకృష్ణతో మరోసారి చేతులు కలపాలని నిర్ణయించుకున్నారు. అమ్మోరు చూసి తనకు అలాంటి మైలురాయి మూవీ కావాలని, బడ్జెట్ ఎంతైనా పర్వాలేదని రిస్కుకి సిద్ధపడ్డారు. గ్రాఫిక్స్ కు భారీ వ్యయం అవుతుంది కాబట్టి క్యాస్టింగ్, సాంకేతిక వర్గం మీద ఎక్కువ బడ్జెట్ పెట్టకూడదని నిర్ణయించుకుని హీరో హీరోయిన్లగా సిజ్జు, అప్పటికే ఓంకారంతో పాటు కొన్ని సినిమాలు చేసిన కన్నడ నటి ప్రేమను తీసుకున్నారు. కేవలం 19 ఏళ్ళ వయసున్న దేవిశ్రీ ప్రసాద్ ని సంగీత సంచలనంగా పరిచయం చేయాలని ఫిక్స్ అయ్యారు.

మంగళూరులో పోలీస్ ఉద్యోగం చేస్తున్న అబు సలీమ్ ని మెయిన్ విలన్ గా ఎంచుకున్నారు. షావుకారు జానకి, భాను చందర్, బాబు మోహన్ తదితరులు ఇతర తారాగణం. అప్పటికే పాము ప్రధాన పాత్రల్లో వచ్చే సినిమాల ట్రెండ్ ఆగిపోయింది. అయినా సరే కోడిరామకృష్ణ గారు అదేమీ ఆలోచించకుండా సుమంత్ ఆర్ట్స్ టీమ్ తో కూర్చుని అద్భుతమైన కథను తయారు చేయించారు. మార్చి 12 థియేటర్లలో విడుదలైన దేవి ఘనవిజయం సాధించింది. కేవలం వారం గ్యాప్ లో వెంకటేష్ రాజా బ్లాక్ బస్టర్ అయినా ఆ పోటీని తట్టుకుని మరీ శతదినోత్సవం జరుపుకుంది. దేవిశ్రీప్రసాద్ కు గొప్ప ప్రారంభాన్ని ఇచ్చింది.