క్రేజీ సీక్వెల్.. ఇంకా క్రేజ్ పెంచేశారు

ఎప్పుడో 90వ దశకంలో మలయాళంలో విడుదలై మంచి విజయం సాధించిన ‘మణిచిత్రతాళు’ అనే సినిమా ఆ తర్వాత దేశవ్యాప్తంగా ప్రభావం చూపింది. ఈ సినిమా కథతోనే కన్నడలో ‘ఆప్తమిత్ర’ తీస్తే అది బ్లాక్ బస్టర్ అయింది. ఆ తర్వాత తమిళంలో రజినీకాంత్ హీరోగా ‘చంద్రముఖి’ పేరుతో రీమేక్ చేస్తే తమిళ, తెలుగు భాషల్లో రికార్డ్ బ్రేకింగ్ హిట్టయింది.

ఈ కథనే హిందీలోకి తీసుకెళ్లారు. ‘భూల్ భూలయియా’ పేరుతో వచ్చిన ఆ సినిమా కూడా సక్సెస్ అయింది. ‘భూల్ భూలయియా’లో అక్షయ్ కుమార్ హీరోగా నటించగా.. రెండేళ్ల కిందట కార్తీక్ ఆర్యన్ హీరోగా దీనికి సీక్వెల్ తీస్తే.. అది ఇంకా పెద్ద సక్సెస్ అయింది. కరోనా తర్వాత స్లంప్‌లో ఉన్న బాలీవుడ్‌కు గొప్ప ఉపశమనాన్ని అందించింది ఈ చిత్రం.

ఇప్పుడీ సినిమాకు ఇంకో సీక్వెల్ రాబోతోంది. ‘భూల్ భూలయియా-3’లోనూ కార్తీకే హీరో. ‘భూల్ భూలయియా’లో ప్రధాన పాత్ర చేసిన విద్యా బాలన్ ఈ ఫ్రాంఛైజీలోకి రీఎంట్రీ ఇస్తుండడం విశేషం. ఇటీవలే ఆమ ఈ సినిమాలో భాగమైన విషయాన్ని వెల్లడించగా.. ప్రేక్షకుల నుంచి మంచి రెస్పాన్స్ వచ్చింది. సినిమాకు ఇంకా క్రేజ్ పెంచిన అడిషన్ ఇది. ఇప్పుడు ఇంకో కొత్త అడిషన్‌తో ‘భూల్ భూలయియా-3’ ఇంకా క్రేజ్ పెంచుకుంది.

‘యానిమల్’ సినిమాలో తక్కువ నిడివి ఉన్న జోయా పాత్రతోనే బలమైన ఇంపాక్ట్ వేసింది త్రిప్తి డిమిరి. హీరోయిన్ రష్మికను మించి ఆమె క్రేజ్ తెచ్చుకుంది. ఆ పాత్రతో త్రిప్తికి బాగా డిమాండ్ ఏర్పడింది. ఆల్రెడీ ఆమె ‘ఆషికి-3’లో నటిస్తోంది. ఇప్పుడు ‘భూల్ భూలయియా-3’లోనూ భాగమైంది. ఆమె రాకతో ఈ సినిమాకు ఇంకా హైప్ వస్తుందనడంలో సందేహం లేదు. ఈ ఏడాది దీపావళికి ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.