కొరియోగ్రాఫర్‌కు చుక్కలు చూపించిన సుక్కు

టాలీవుడ్ దర్శకుల్లో మిస్టర్ పర్ఫెక్షనిస్ట్‌లుగా పేరున్న వాళ్లలో రాజమౌళి ముందు వరుసలో ఉంటారు. తనకు కావాల్సిన ఔట్ పుట్ కోసం ఆయన ఆర్టిస్టులను, టెక్నీషియన్లను ఎంత కష్టపెడతారో కథలు కథలుగా చెప్పుకుంటారు ఇండస్ట్రీలో. జక్కన్న తర్వాత ఆ స్థాయిలో తన టీం సభ్యులను సతాయించేది సుకుమారే అంటుంటారు.

పని రాక్షసుడిగా పేరున్న సుకుమార్.. రైటింగ్ దగ్గర్నుంచి మేకింగ్ వరకు ఏ విషయంలోనూ ఒక పట్టాన సంతృప్తి చెందరు. ఆయన స్క్రిప్టు ఏ దశలోనూ లాక్ కాదు. సెట్స్‌లో అప్పటికప్పుడు సన్నివేశం మార్చేస్తారు. డైలాగ్స్ కొత్తగా రాయిస్తారని ఎన్టీఆర్ సహా చాలామంది చెప్పారు.

ఇక మేకింగ్ టైంలో సెట్స్‌లో ఎంతమంది ఉన్నా.. ఎంత టైం పట్టినా.. ఆయన తాను కోరుకున్న ఔట్ పుట్ వచ్చేవరకు రాజీపడరని అంటారు. పేరున్న టెక్నీషియన్లు సైతం సుకుమార్ దెబ్బకు బెంబేలెత్తిపోతుంటారని ఇండస్ట్రీలో చెప్పుకుంటూ ఉంటారు.

‘పుష్ప-2’ మీద ఉన్న భారీ అంచనాలను అందుకునేందుకు సుకుమార్ తన టీంతో కలిసి మామూలుగా కష్టపడట్లేదు. ప్రేక్షకులకు ది బెస్ట్ ఇవ్వడం కోసం ఆయన ఆర్టిస్టులను, టెక్నీషియన్లను మామూలుగా సతాయించట్లేదట. ఆయన దెబ్బకు దేశంలోనే టాప్ కొరియోగ్రాఫర్లలో ఒకడైన గణేష్ ఆచార్య కూడా బెంబేలెత్తిపోయినట్లు సమాచారం. సినిమాలో అత్యంత కీలకమైన గంగ జాతర ఎపిసోడ్లో వచ్చే పాటకు గణేషే నృత్యరీతులు సమకూర్చాడు. రామోజీ ఫిలిం సిటీలో వేసిన సెట్లో కొన్ని వారాల పాటు ఈ పాట చిత్రీకరణ జరిగిందట.

ఈ పాట కోసం కొన్ని వారాల పాటు పని చేశాడట గణేష్. ఆయన కెెరీర్లోనే అత్యధిక రోజులు పని చేసిన పాటల్లో ఇదొకటని సమాచారం. ముందు అనుకున్న కాల్ షీట్స్ కంటే రెండు మూడు రెట్లు కేటాయించాల్సి వచ్చిందట. కేవలం గణేష్ ఆచార్య ఒక్కడి పారితోషకం కోట్లల్లోకి వెళ్లిపోయిందట.

స్టెప్పులు మార్చి మార్చి కంపోజ్ చేయడం.. షూట్ దగ్గర బాగా ఆలస్యం జరగడంతో గణేష్ ఆచార్య ఇదెక్కడి పర్ఫెక్షనిజం అంటూ తల పట్టుకున్నాడట గణేష్. ఐతే ఇలా ఎంత కష్టపడ్డా, ఎంత ఆలస్యం జరిగినా ఆ సమయానికి అసహనం చెందిన వాళ్లు కూడా. చివరికి తెరపై ఔట్ పుట్ చూశాక ఎవ్వరైనా సుక్కుకి సలాం కొడతారనడంలో సందేహం లేదు.