మంచు లక్ష్మి.. ఆదిపర్వం

మంచు ఫ్యామిలీ నుంచి కొంచెం లేటుగా సినీ రంగంలోకి అడుగు పెట్టింది లక్ష్మీ ప్రసన్న. తండ్రి వారసత్వాన్ని కొనసాగిస్తూ ఆమె ముందు విలన్‌గా అరంగేట్రం చేసింది. ఆ చిత్రమే.. అనగనగా ఓ ధీరుడు. ఆ సినిమాలో మంచి లక్ష్మి చాలా బాగా నటించి నంది అవార్డు కూడా గెలుచుకుంది కానీ.. సినిమా ఆడకపోవడంతో నిరాశ తప్పలేదు.

ఆ తర్వాత గుండెల్లో గోదారి, దొంగాట సహా కొన్ని సినిమాల్లో మంచు లక్ష్మి లీడ్ రోల్స్ చేసింది కానీ.. ఏవీ సరైన ఫలితాన్ని ఇవ్వలేదు. దీంతో కొన్నేళ్ల పాటు గ్యాప్ తీసుకోక తప్పలేదు. వైఫ్ ఆఫ్ రామ్ తర్వాత విరామం తీసుకుని.. రెండేళ్ల తర్వాత తన తండ్రి మోహన్ బాబు కలయికలో ఒక థ్రిల్లర్ మూవీని ప్రకటించింది మంచు లక్ష్మి. కానీ ఆ సినిమా ఏమైందో తెలియదు. ఆరంభమయ్యాక దాన్నుంచి ఏ అప్‌డేట్ లేదు. కాగా ఇప్పుడు మంచు లక్ష్మి కొత్త సినిమాను ప్రకటించింది.

ఆ సినిమానే.. ఆదిపర్వం. ఎర్రగుడి కథ అనేది ఈ సినిమా ఉప శీర్షిక. ఈ ట్యాగ్ లైన్‌కు తగ్గట్లే రెడ్ కలర్ బ్యాక్ డ్రాప్‌తో పోస్టర్లు వదిలారు. మంచు లక్ష్మి భయానక అవతారాలతో వదిలిన పోస్టర్లు ఆకర్షణీయంగానే ఉన్నాయి. సంజీవ్ మెగోటి అనే కొత్త దర్శకుడు ఈ చిత్రాన్ని రూపొందిస్తున్నాడు. ఎమ్మెస్కే నిర్మాత.

ప్రొడక్షన్, టెక్నికల్ టీంలో అందరూ కొత్తవాళ్లే కనిపిస్తున్నారు. పోస్టర్లు చూస్తే గ్రాండ్‌గానే కనిపిస్తున్నాయి. తొంభైవ దశకంలో ఇలాంటి దేవత-గుడి కథలు చాలా వచ్చేవి. ఆ తర్వాత ఆ ట్రెండుకు తెరపడింది. ఇప్పుడు మంచు లక్ష్మి తిరిగి ఆ జానర్లోకి అడుగు పెడుతోంది. మరి ఈ సినిమా అయినా మంచు వారమ్మాయికి మంచి బ్రేక్ ఇస్తుందేమో చూడాలి.