దర్శకుడిని ‘ఒరేయ్ గుండు’ అంటే..

సోషల్ మీడియాలో ఊరూ పేరూ లేని వాళ్లు సెలబ్రెటీలను ఉద్దేశించి ఎలా పడితే అలా మాట్లాడేస్తుంటారు. బూతులు తిడుతుంటారు. ఏకవచనంతో సంబోధిస్తుంటారు. చాలా క్యాజువల్‌గా కామెంట్లు పెట్టేస్తుంటారు. వీటిని చాలావరకు సెలబ్రెటీలు పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోతుంటారు. కొందరేమో రాంగ్ కామెంట్లకు దీటుగా బదులిస్తుంటారు. కొందరు మాత్రం కామెంట్లను స్పోర్టివ్‌గా తీసుకుంటూ ఉంటారు.

చాలా ఏళ్ల కిందట సిద్దార్థ్-షాలిని జంటగా ‘ఓయ్’ సినిమా తీసిన ఆనంద్ రంగా తన గురించి ఓ నెటిజన్ చేసిన వ్యాఖ్యకు స్పందించిన తీరు అందరినీ ఆకట్టుకుంటోంది. రెండేళ్లుగా రీ రిలీజ్ ట్రెండ్ నడుస్తున్న నేపథ్యంలో ‘ఓయ్’ సినిమాను మళ్లీ రిలీజ్ చేయాలని చాలామంది సోషల్ మీడియాలో అడుగుతున్నారు. దానికి స్పందిస్తూ వేలంటైన్స్ డే కానుకగా ఈ నెల 14న ‘ఓయ్’ను రీ రిలీజ్ చేయబోతున్నట్లు ప్రకటించాడు ఆనంద్ రంగా.

ఈ పోస్టు కింద ఒక నెటిజన్ స్పందిస్తూ.. ‘‘ఒరేయ్ గుండు నాయాలా ఇలాంటి మంచి సినిమా తీసి ఎటు పోయావ్ రా’’ అని కామెంట్ పెట్టారు. దానికి నవ్వుతున్న ఎమోజీని రిప్లైగా ఇచ్చాడు ఆనంద్. దానికి ఆ నెటిజన్.. ‘‘మిమ్మల్ని గుండు అన్నందుకు సారీ’’ అని బదులిచ్చాడు. మళ్లీ ఆనంద్ స్పందిస్తూ.. ‘‘పర్వాలేదు. అది నిజమే కదా’’ అని కామెంట్ పెట్టడం విశేషం. ఒక దర్శకుడు ఇంత స్పోర్టివ్‌గా స్పందించడం నెటిజన్లను ఆకట్టుకుంటోంది. ‘ఓయ్’ అనుకున్నంత బాగా ఆడకపోయినా.. దర్శకుడిగా ఆనంద్ రంగాకు మంచి పేరే తెచ్చింది. కానీ అతను తర్వాత నిలదొక్కుకోలేకపోయాడు. ‘పొగ’ అని ఓ సినిమా.. ఇంకేదో మూవీ తీసినా ఫలితం లేకపోయింది. ఈ మధ్య అతను ఓటీటీ కంటెంట్ మీద దృష్టిపెట్టాడు.