కమల్ రజని తర్వాత ఇప్పుడు విజయ్

స్టార్ హీరోలు రాజకీయాల్లోకి రావడం కొత్తమీ కాదు కానీ తమదైన ముద్ర వేసి రాష్ట్రాలను పాలించినవాళ్లు చాలా తక్కువ. వెంటనే గుర్తొచ్చే పేర్లు కొన్నే. ఎన్టీఆర్, ఎంజిఆర్, జయలలితల గురించి ప్రముఖంగా చెప్పుకోవచ్చు. తాజాగా విజయ్ తన పొలిటికల్ పార్టీని ప్రకటించాడు. 2026 అసెంబ్లీ ఎన్నికలను లక్ష్యంగా పెట్టుకుని తమిజగ వెట్రి కజగం పేరుతో దీన్ని స్థాపించినట్టు ఒక సుదీర్ఘ ప్రకటనలో వెల్లడించాడు. చేతిలో ఉన్న వెంకట్ ప్రభు సినిమాతో పాటు ఇంకొక్క కమిట్ మెంట్ మాత్రమే ఇచ్చానని, వాటి తర్వాత పూర్తిగా ప్రజాసేవకు అంకితమవుతానని చెప్పడం హాట్ టాపిక్ గా మారింది.

ఇదంతా బాగానే ఉంది కానీ విజయ్ గమనించాల్సింది చరిత్రను. అంత పెద్ద సూపర్ స్టార్ రజనీకాంత్ అన్నీ సిద్ధం చేసుకుని తర్వాత రాజకీయాల్లో ఇమడలేనంటూ సెలవు తీసుకోవడం ఫ్యాన్స్ మర్చిపోలేదు. ఒకవేళ ఆయన కొనసాగి ఉంటే ఇవాళ సీఎం అయ్యేవారని అభిమానులు నమ్ముతారు. ఆర్భాటంగా పార్టీ పెట్టిన కమల్ హాసన్ అడపాదడపా కార్యక్రమాలు చేయడం మినహాయించి అధికారం కోసం కష్టపడిన దాఖలాలు తక్కువే. పైగా కాంగ్రెస్ మద్దతుదారనే ముద్ర సామాన్య జనాలకు దూరం చేసింది. విజయ్ కాంత్ ఎంత పోరాడినా తన పార్టీని బలంగా నిలబడేలా చేయలేకపోయారు.

మనవైపు చూస్తే చిరంజీవి, కృష్ణ, కృష్ణంరాజు ఇలా ఎందరో అగ్రనటులు రాజకీయాల్లో అడుగు పెట్టి తక్కువ సమయంలో వద్దనుకుని బయటికి వచ్చారు. మరి విజయ్ ఈ ట్రెండ్ కి ఎదురీది తన సత్తా చాటుతాడా అనేది కీలకంగా మారింది. ఇంకో రెండేళ్లు సమయం ఉంది కాబట్టి ఏదో పెద్ద ప్రణాళికనే వేసుకుని ఉంటాడు. హిట్టు ఫ్లాపుతో సంబంధం లేకుండా విజయ్ కున్న ఫాలోయింగ్ మామూలుది కాదు. గత పదేళ్లలో అభిమానగణం విపరీతంగా పెరిగిపోయింది. మరి పైన చెప్పిన రెండు రకాల ఉదాహరణల్లో విజయ్ ఏ కోవలోకి చేరతాడో ఇంకో రెండు సంవత్సరాల్లో కాలమే సమాధానం చెప్పనుంది.