చూసి నవ్వుకుంటున్న త్రివిక్రమ్

గుంటూరు కారం బాక్సాఫీస్ కథ ముగింపుకొచ్చింది. ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తప్ప థియేటర్లలో విడుదలయ్యాక దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ ఎక్కడా కనిపించలేదు. ఇంటర్వ్యూల ఊసే లేదు. నిర్మాత నాగవంశీనే ఆ బాధ్యతని పూర్తి చేశారు. ఇది కాసేపు పక్కనపెడితే త్రివిక్రమ్ తర్వాత చేయబోయే సినిమాల గురించి ఆన్ లైన్ లో జరుగుతున్న ప్రచారాలు చూసి ఆయన తెగ నవ్వుకుంటున్నారట. ఒకరేమో పవన్ కళ్యాణ్ తో మీడియం బడ్జెట్ లో ఒక కథ రెడీ అంటారు. ఇంకొకరేమో మహేష్ బాబు రాజమౌళి కన్నా ముందు గురూజీకే ఇంకో ఛాన్స్ ఇస్తున్నారని ప్రచారం చేస్తున్నారు.

ఇంకోవైపు నాని లేదా వెంకటేష్ లేదంటే ఈ ఇద్దరితో ఒక మల్టీస్టారరనే పబ్లిసిటీ హోరెత్తిస్తున్నారు. అసలు మ్యాటర్ ఏంటంటే ఇవేవి నిజం కాదు. త్రివిక్రమ్ ప్రస్తుతం ఏ ఆలోచనా చేయడం లేదు. తన దర్శకత్వంలో ఆయన అఫీషియల్ గా కమిట్ అయ్యింది ఒక్క అల్లు అర్జున్ కి మాత్రమే. అది కూడా ఫలానా టైంలో మొదలుపెట్టాలనే ఒత్తిడి ఎంత మాత్రం లేదు. పుష్ప 2 అయ్యాక బన్నీ నిర్ణయాన్ని బట్టి స్క్రిప్ట్ ఏ టైంకి సిద్ధం చేయాలనేది ఆధారపడి ఉంటుంది. గుంటూరు కారం విషయంలో తన మీద వచ్చిన కామెంట్లను త్రివిక్రమ్ విశ్లేషించుకున్నాకే తప్పొప్పుల గురించి క్లారిటీ వచ్చింది.

సో మాటల మాంత్రికుడి తర్వాతి అడుగు ఏమై ఉంటుందనే స్పష్టతకి ఇంకొంత కాలం వేచి చూడాలి. ప్రస్తుతం సితార బ్యానర్ లో విశ్వక్ సేన్ చేస్తున్న గ్యాంగ్స్ అఫ్ గోదావరి ఫైనల్ కాపీ ఓకే చేయడానికి ముందు త్రివిక్రమ్ కు చూపించే దిశగా నాగవంశీ ప్లాన్ చేస్తున్నాడు. ఆయన సలహాలు సూచనలు బట్టి ఎడిటింగ్ పరంగా ఏమైనా మార్పులు ఉండొచ్చు. మ్యాడ్ 2 మ్యాజిక్ సంబందించిన అప్డేట్స్ కూడా ఎప్పటికప్పుడు త్రివిక్రమ్ కి అందజేస్తున్నారు. పద్మవిభూషణ్ వచ్చాక చిరంజీవిని కలిసినప్పుడు తప్ప కెమెరా కంటికి చిక్కని త్రివిక్రమ్ మళ్ళీ దర్శనం ఇచ్చేది ఎప్పుడోనని ఫ్యాన్స్ వెయిటింగ్.