ఇళయరాజా కూతురు ఇక లేరు

ఇసైజ్ఞాని ఇళయరాజా కూతురు భవతారిణి ఇవాళ కన్ను మూశారు. గత కొంత కాలంగా లివర్ క్యాన్సర్ తో బాధపడుతున్న ఆవిడ చికిత్స కోసం శ్రీలంకలో ఉన్నారు. వైద్యులు ఎంత ప్రయత్నించినప్పటికీ కోలుకోలేక చివరి శ్వాస తీసుకున్నారు. స్వతహాగా ఎంతో ప్రతిభ కలిగిన భవతారిణి కేవలం ఒక లెజెండరీ వారసురాలిగానే కాక స్వంతంగా ఎదిగేందుకు చాలా కష్టపడింది. ఆవిడ తొలిసారి గాత్రం అందించిన చిత్రం రాసయ్య. డెబ్యూ ఆల్బమే మంచి పేరు తీసుకురావడంతో అక్కడి నుంచి వెనుదిరిగి చూడాల్సిన అవసరం రాలేదు. ఎక్కువగా తండ్రి కంపోజ్ చేసిన పాటలే పాడేవారు.

2001లో షియాజీ శిందే ప్రధాన పాత్ర పోషించిన ‘భారతి’లో మాయిల్ పోలా పొన్ను పాడినందుకు గాను జాతీయ అవార్డు దక్కింది. స్వరపరిచింది ఇళయరాజానే. సోదరులు యువన్ శంకర్ రాజా, కార్తీక్ రాజా ఇద్దరూ ఆమెకు ఎంతో తోడ్పాటు అందించారు. తెలుగులో భవతారిణి కంపోజ్ చేసిన ఆల్బమ్ ‘అవునా’ ఒక్కటే. సి ఉమామహేశ్వరరావు దర్శకత్వం వహించిన ఈ సినిమాకు మధు అంబట్ లాంటి ఛాయాగ్రాహకులు పని చేశారు. అయితే అది విడుదలైన దాఖలాలు లేవు. 2002 లో రేవతి డైరెక్ట్ చేసిన ‘మిత్ర్ మై ఫ్రెండ్’తో సంగీత దర్శకురాలిగా కొత్త ప్రస్థానం మొదలుపెట్టారు.

మాయానది భవతారిణి చివరి చిత్రం. భర్త పేరు శబరి రాజ్. యాడ్ ఏజెన్సీ ఉంది. 47 ఏళ్లకే కన్ను మూయడం ఇళయరాజాకు తీరని శోకం మిగల్చనుంది. వ్యక్తిగత కారణాల వల్ల చాలా కాలంగా పరిశ్రమకు దూరంగా ఉన్న భవతారిణికి అవకాశాలు ఇచ్చిన రూపంలో ఎందరో సెలబ్రిటీలతో గొప్ప పరిచయాలు ఏర్పడ్డాయి. ఒకే కూతురు ఇలా దూరం కావడం ఏ తండ్రికైనా కడుపు కోతే. పార్థీవ దేహాన్ని తీసుకొస్తున్నారు. రేపు చెన్నైలో అంత్యక్రియలు జరుగుతాయి. ఇళయరాజాతో అనుబంధం దృష్ట్యా తమిళ తెలుగు సినీ ప్రముఖులు ఎందరో ప్రత్యక్షంగా పరోక్షంగా తమ సంతాపం ప్రకటిస్తున్నారు.