మల్టీప్లెక్సు స్క్రీన్ మీద రామాలయ ఘట్టం

జనవరి 22న అయోధ్యలో జరగబోయే మహా ఘట్టం రామాలయ ప్రారంభోత్సవం కోసం యావత్ దేశం వేయి కళ్ళతో ఎదురు చూస్తోంది. కొన్ని రాష్ట్రాలు అధికారికంగా సగం రోజు సెలవు ప్రకటించాయంటే దీని పట్ల ఎంత ఆసక్తి ఉందో అర్థం చేసుకోవచ్చు. అయితే ఇంత సుమధుర వేడుకని చిన్ని తెరపై చూస్తే పూర్తిగా ఆస్వాదించలేమని అనుకుంటున్నారా. అయితే ఛలో మల్టీప్లెక్స్ అంటోంది పివిఆర్ ఐనాక్స్ యాజమాన్యం. దేశవ్యాప్తంగా 160కి పైగా స్క్రీన్లలో లైవ్ గా రాముడి ఆగమనాన్ని ప్రదర్శించబోతున్నారు. టైం పరిమితి అంటూ లేదు. జరిగినంత సేపు చూస్తూనే ఉండొచ్చు.

ప్రత్యేకత ఏంటంటే టికెట్ ధర కేవలం 100 రూపాయలు మాత్రమే. అసలు ట్విస్టు మరొకటి ఉంది. ఉచితంగా పాప్ కార్న్ కూడా అందిస్తారు. ఇంకేముంది కిట్టుబాటు కావడానికి ఇంత కన్నా వేరే ఆఫర్ ఏముంటుంది. ప్రముఖ న్యూస్ ఛానల్ ఆజ్ తక్ తో కలిసి పివిఆర్ ఈ స్కీంని తీసుకొచ్చింది. ఇదేదో బాగుందని ఆడియన్స్ అప్పుడే టికెట్లు బుక్ చేసుకోవడం కోసం ఎదురు చూస్తున్నారు. ఎంచక్కా కుషన్ సీట్లలో కూర్చుని, ఇష్టమైన పాప్ కార్న్ తింటూ పెద్ద తెరపై రాముడి దర్శనం చేసుకోవడం కొత్త అనుభూతినిస్తుంది. హైదరాబాద్ సహా అన్ని నగరాల్లోనూ షోలు ఉంటాయి.

గతంలో క్రికెట్ మ్యాచులు ఇలా ప్రసారం చేసేవాళ్ళు. ఇప్పుడు ఈ ట్రెండ్ ఆలయ ఓపెనింగ్స్ కు వచ్చేసింది. చరిత్రలోనే ఒక అరుదైన సంఘటనగా నిలిచిపోయే రామాలయ ప్రారంభోత్సవ వేడుకని కనివిని ఎరుగని స్థాయిలో నిర్వహించేందుకు కేంద్ర ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేస్తోంది. 90 దశకంలో జనాలను భక్తి పారవశ్యంలో ముంచెత్తిన రామాయణం సీరియల్ ని జనవరి 24న పివిఆర్ మల్టీప్లెక్సుల్లో ప్రదర్శించే ప్రతిపాదన ఉంది కానీ వీడియో నాణ్యతలో ఇబ్బందులఉన్న కారణంగా ఇంకా ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట. సో థియేటర్లో గుడిని చూడాలంటె టికెట్ బుక్ చేసుకోండి మరి.