ముందు ప్రభాస్ తర్వాత తారక్

సలార్ పార్ట్ 1 సీజ్ ఫైర్ తర్వాత ముందు అనుకున్న ప్లానింగ్ ప్రకారం దర్శకుడు ప్రశాంత్ నీల్ ఈ వేసవి నుంచి జూనియర్ ఎన్టీఆర్ సినిమా మొదలుపెట్టాలి. అయితే ఇప్పుడీ ఆర్డర్ మారబోతున్నట్టు ఇన్ సైడ్ టాక్. సలార్ 2 శౌర్యంగపర్వం వీలైనంత త్వరగా పూర్తి చేద్దామని ప్రభాస్ కోరడంతో నీల్ దానివైపే మొగ్గు చూపుతున్నారట. దీనికి కారణం లేకపోలేదు. సలార్ కు ఓ రెండేళ్ల తర్వాత ఇంత క్రేజ్ ఉంటుందా అంటే చెప్పలేని పరిస్థితి. బాహుబలిలో కట్టప్ప ఎందుకు ద్రోహం చేశాడనే పాయింట్ హైప్ ని కొనసాగించింది కానీ సీజ్ ఫైర్ ఆ స్థాయిలో శౌర్యంగపర్వం మీద బజ్ తీసుకురాలేదు.

వేడిగా ఉన్నప్పుడే పాలు కాచుకోవాలి తరహాలో ఆరు వందల కోట్లకు పైగా వసూళ్లతో సత్తా చాటిన సలార్ మీద హైప్ ఉన్నప్పుడే రెండో భాగం తీస్తే వచ్చే ఏడాది విడుదలకు అనుకూలంగా ఉంటుంది. ఎలాగూ తారక్ దేవర 1 తర్వాత వార్ 2లో బిజీ అవుతాడు. అది పూర్తయ్యేలోగా కొరటాల శివ దేవర 2 స్క్రిప్ట్ తో రెడీగా ఉంటాడు. కాబట్టి ఎంతలేదన్నా ఒక ఏడాది పాటు యంగ్ టైగర్ డేట్లు గంపగుత్తగా దొరకడం కష్టం. అందుకే సలార్ శౌర్యంగ పర్వం ముందు తెరకెక్కే ఛాన్స్ ఉంది. పైగా సెట్ వర్క్, విజువల్ ఎఫెక్ట్స్ కి పని చేసిన టీమ్ అన్నీ సిద్ధంగా ఉన్నాయి కాబట్టి నిర్మాణం ఆలస్యం కాదు.

వీటికి సంబంధించిన అధికారిక ప్రకటనలు ఆయా హీరోలతో చర్చించాకే బయటికి వస్తాయి. అప్పటిదాకా ఎదురు చూడాల్సిందే. ప్రభాస్ ప్రస్తుతం కల్కి 2898 ఏడి, ది రాజా సాబ్ లతో బిజీగా ఉన్నాడు. మొదటి దాని పనులు మార్చి నెలాఖరులోపు పూర్తవుతాయి. ఇక మారుతీ సినిమాకు అంత ఒత్తిడేమి లేదు. సందీప్ రెడ్డి వంగా స్పిరిట్ ఫైనల్ వెర్షన్ రెడీ చేయడానికి ముందు యానిమల్ పార్క్ చేసే ఆలోచనలో సీరియస్ గా ఉన్నాడు. ఇవన్నీ విశ్లేషించుకుంటే సలార్ 2 శౌర్యంగ పర్వం ముందు సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. పార్ట్ 1 రేపటి నుంచే నెట్ ఫ్లిక్స్ లో వస్తున్న సంగతి తెలిసిందే.