చిరంజీవి VS  ప్రభాస్ – ఛాన్సే లేదు

ఇంకా ఏడాది సమయం ఉన్నా 2025 సంక్రాంతి గురించి అప్పుడే రకరకాలుగా పోటీ గురించిన అంచనాలు, విశ్లేషణలు మొదలైపోయాయి. ఇప్పటిదాకా అధికారికంగా పండగకు లాక్ చేసుకున్నవి రెండు. ఒకటి చిరంజీవి విశ్వంభర. షూటింగ్ ఆల్రెడీ జరుగుతోంది కాబట్టి వశిష్ట ఎంత ప్లాన్డ్ గా తీస్తాడనే దాన్ని బట్టి టార్గెట్ రీచ్ కావడం ఆధారపడి ఉంటుంది. రెండోది శతమానం భవతి నెక్స్ట్ పేజీ. దిల్ రాజు ప్రకటన ఇచ్చారు తప్ప దర్శకుడెవరో ఫైనల్ కాలేదు. ప్యాన్ ఇండియా కాదు కనక ఎంత ఆలస్యంగా స్టార్ట్ చేసినా డెడ్ లైన్ ని అందుకోవడం కష్టం కాదు. అందుకే అనౌన్స్ చేశారు.

ఇవి కాకుండా ఇంకెవరు కర్చీఫ్ లు వేయలేదు. అయితే నిన్న ఫస్ట్ లుక్ రిలీజ్ చేసిన ది రాజాసాబ్ ని సంక్రాంతికే లక్ష్యంగా పెట్టుకున్నారనే టాక్ మొదలైంది. నిజానికి దీనికి ఛాన్స్ లేదు. ఎందుకంటే విశ్వంభర నిర్మాతలు యువి క్రియేషన్స్. వంశీ, ప్రమోద్ లు నిర్మాతలే అయినప్పటికీ వీళ్ళ వెనుక ప్రాణ స్నేహితుడిగా ప్రభాస్ అండ ఎంత ఉందో మళ్ళీ చెప్పనక్కర్లేదు. అలాంటప్పుడు చిరంజీవితో పోటీ సై అని ఎలా అంటాడు. ఒకవేళ మెగా మూవీ ఆలస్యం అవుతుందనుకుంటే అప్పుడు రాజాసాబ్ కి గ్రీన్ సిగ్నల్ ఇవ్వొచ్చు. షూట్ కూడా ఇంకా చాలా పెండింగ్ ఉంది.

ఇన్ సైడ్ ఇన్ఫో ప్రకారం ది రాజా సాబ్ వచ్చేది డిసెంబర్ లోనే. సలార్ తరహాలోనే ఏడాదిని బ్లాక్ బస్టర్ తో ముగించాలనేది ప్రభాస్ ఆలోచన. దర్శకుడు మారుతీ కూడా డేట్లు దొరకడం ఆలస్యం చకచకా షూట్ పూర్తి చేస్తున్నాడు. దీపావళిలోపు ఫస్ట్ కాపీ సిద్ధం చేస్తానని హామీ ఇచ్చాడట. సో ఎలా చూసుకున్నా ప్రభాస్ చిరంజీవిలు తలపడటం జరగని పని. పైగా ఇద్దరికీ పర్సనల్ గా కూడా ఎంతో బాండింగ్ ఉంది కాబట్టి చొరవ తీసుకుని ఈ క్లాష్ ని ఆపుతారు. ఇక విశ్వంభర రెగ్యులర్ షూటింగ్ ఆల్రెడీ మొదలైపోయింది కానీ ఇంకో వారం పదిరోజుల్లో చిరంజీవి సెట్స్ లోకి అడుగుపెట్టబోతున్నారు.