ఒక్క మల్టీప్లెక్స్.. 41 షోలు

ఒక సింగిల్ థియేటర్లో ఒక రోజుకు గరిష్టంగా ఆరు షోలు మాత్రమే సాధ్యమవుతాయి. అయితే పర్మిషన్లు లభించేది ఐదు షోలకు మాత్రమే. అయితే మల్టీప్లెక్సుల లెక్క వేరుగా ఉంటుంది. అక్కడ ఎక్కువ స్క్రీన్లు ఉంటాయి. ఎక్కువ షోలూ ఆడించే అవకాశం ఉంటుంది. దీంతో పెద్ద సినిమా రిలీజ్ అయినప్పుడు డిమాండ్ ను బట్టి 10- 20-25-30 షోలు వేస్తుంటారు. హైదరాబాద్ విషయానికి వస్తే ఒక రోజులో ఒక సినిమాకు అత్యధిక షోలు పడేది ప్రసాద్ ఐమాక్స్ లోనే. ఈ ఐకానిక్ మల్టీప్లెక్స్ లో అత్యధిక షోల రికార్డును మహేష్ బాబు కొత్త చిత్రం గుంటూరు కారం చెరిపేసింది.

జనవరి 12న విడుదలవుతున్న ఈ చిత్రానికి తొలి రోజు ఏకంగా 40 షోలు వేస్తోంది ప్రసాద్ ఐమాక్స్. అర్ధరాత్రి ఒంటిగంట నుంచే తొలి షో మొదలవుతుంది. ఆ తర్వాత నాలుగు గంటలకు అందుబాటులో ఉన్న ఏడు స్క్రీన్లలోనూ గుంటూరు కారం చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. ఉదయం నుంచి హనుమాన్ కు కొన్ని షోలు కేటాయించి మిగతా అన్ని స్క్రీన్లలోనూ గుంటూరు కారంతోనే నడిపించునున్నారు.

ఇప్పటిదాకా ప్రసాద్ ఐమాక్స్ లో ఏ సినిమా కూడా 40 షోల మార్కును టచ్ చేయలేదు. గత ఏడాది భారీ అంచనాల మధ్య విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా 33 షోలతో రికార్డు నెలకొల్పింది. దాన్ని ఇప్పుడు గుంటూరు కారం బద్దలు కొట్టింది. రోబో-2 అన్ని భాషల్లో కలిపి 32 షోలతో మూడో స్థానంలో ఉంది. గుంటూరు కారం లాంటి మామూలు మాస్ సినిమాతో ఒక్క మల్టీప్లెక్స్ లో ఏకంగా 41 షోలతో రికార్డ్ నెలకొల్పడం మహేష్ బాబుకే సాధ్యమైంది.