మహేష్ అభిమానులు గరం గరం

సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టులో పెద్దోడు చిన్నోడుని చాలా రోజుల తర్వాత ఒకే స్టేజి మీద చూడొచ్చని ఎదురు చూసిన అభిమానులకు నిన్న జరిగిన వెంకీ 75 ఈవెంట్ లో నిరాశే ఎదురయ్యింది. చిరంజీవితో పాటు నాగ్, బాలయ్య, మహేష్ బాబు వస్తారని నిర్వాహకులు ముందే ప్రకటించడంతో దానికి తగ్గట్టే సూపర్ స్టార్ ఫ్యాన్స్ ఎక్కడెక్కడి నుంచో హైదరాబాద్ వచ్చారు. వేడుక నిర్వహించిన ఈటీవీ విన్ అడిగినట్టు నెల చందా తీసుకుని, సోషల్ మీడియాలో స్పందించి, వాళ్ళు కోరిన చోటకు వెళ్లి మరీ పాసులు తీసుకున్నారు. దీనికి గంటల తరబడి సమయాన్ని, వ్యయ ప్రయాసలను భరించారు. కానీ మహేష్ రాలేదు.

కారణం లేకపోలేదు. గుంటూరు కారం చివరి దశ షూటింగ్ పీకల మీద జరుగుతోంది.ఇవాళో రేపో గుమ్మడికాయ కొట్టేందుకు దర్శకుడు త్రివిక్రమ్, నిర్మాత నాగవంశీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇలాంటి టైంలో రెండు మూడు గంటలు ఒక ఈవెంట్ కొచ్చి కూర్చునేంత తీరిక మహేష్ దగ్గర లేదు. ముందు రావాలని నిర్ణయించుకున్న మాట వాస్తవమే. కానీ నిన్న షెడ్యూల్ కి సంబంధించిన చిత్రీకరణ అనుకున్న సమయానికి పూర్తి కాకపోవడంతో పొద్దుపోయే దాకా సెట్లోనే ఉండాల్సి వచ్చింది. పోనీ లేట్ గా వెళ్దామంటే అక్కడ ఇతర గెస్టులుగా చిరంజీవి లాంటి సీనియర్లొచ్చారు కాబట్టి సాధ్యం కాదు.

ఇలా మహేష్ ఇష్టంలేకపోయినా మిస్ చేసుకోవాల్సి వచ్చింది. నాగార్జునది కూడా ఇదే సమస్య. నా సామిరంగ ఒత్తిడిలో పరుగులు పెడుతున్నాడు. బాలయ్య సైతం హాజరు కాలేదు. అందరూ వచ్చి ఉంటే ఆ కళ, సందడి వేరుగా ఉండేది. అరుదైన కలయికకు జ్ఞాపకంగా నిలిచేది. ఎందుకంటే నలుగురు సీనియర్ స్టార్లు పబ్లిక్ గా కలిసి కనిపించి చాల ఏళ్ళు గడిచాయి. కానీ ఉన్నంతలో చిరంజీవితో పాటు యూత్ స్టార్లు రావడంతో స్టేజి సందడిగా మారింది. కలియుగ పాండవులు టు సైంధ‌వ్‌ పేరుతో చేసిన ఈ ఈవెంట్ ఆదివారం నుంచి ఇంట్లోనే చూసుకోవచ్చు.