ఆరు వేల టికెట్లమ్మి షాకిచ్చిన వెంకీ

టాలీవుడ్ రీ రిలీజులు జనాలకు బోర్ కొట్టేసిన టైంలో వెంకీని మళ్ళీ విడుదల చేయడం పట్ల అనుమానాలు తలెత్తాయి కానీ తీరా ట్రెండ్ చూస్తుంటే దానికి భిన్నంగా కనిపిస్తోంది. బుకింగ్స్ ఓపెన్ చేసిన మొదటి ఇరవై నాలుగు గంటల లోపే 6 వేల 300 టికెట్లు అమ్ముడుపోవడం చూసి అభిమానుల ఆనందం అంతా ఇంతా కాదు. ఇది బుక్ మై షో యాప్ లో అధికారికంగా చూపిస్తున్న నెంబరే. అలా అని తెలుగు రాష్ట్రాల అన్ని కేంద్రాల్లో అమ్మకాలు జరగడం లేదు. కేవలం హైదరాబాద్ క్రాస్ రోడ్స్ నుంచే ఇంత పెద్ద ఫిగర్ నమోదు కావడం విశేషంగా చెప్పుకోవాలి.

మాస్ మహారాజా రవితేజ కెరీర్ లో వెంకీకి ప్రత్యేక స్థానం ఉంది. ముఖ్యంగా గంటకు పైగా సాగే సుధీర్ఘమైన ట్రైన్ ఎపిసోడ్ థియేటర్లలో ఓ రేంజ్ లో పేలింది. బ్రహ్మానందం, ఏవీఎస్, మాస్టర్ భరత్ ల పాటు హీరో ఫ్రెండ్స్ బృందం చేసే కామెడీ మాములుగా నవ్వించలేదు. ఇప్పటికీ ఎన్నో మీమ్స్ వీటిని ఆధారంగా చేసుకునే వస్తుంటాయి. బ్రహ్మీ ఎక్స్ ప్రెషన్ల గురించి ఎంత చెప్పినా తక్కువే. దర్శకుడు శ్రీను వైట్ల రేంజ్ పెరగడంలోనూ ఇది దోహదపడింది. హీరోయిన్ స్నేహ, దేవిశ్రీ ప్రసాద్ సంగీతం, అశుతోష్ రానా విలనీ, చక్కని హాస్యం ఇలా ఎన్నో అంశాలు విజయానికి దోహదపడింది.

ఈ నెల 30న వెంకీని రిలీజ్ చేస్తుండగా మరుసటి రోజు 31న రజనీకాంత్ శివాజీ రాబోతోంది. దీనికి వెంకీ స్పందనలో సగం కూడా లేకపోవడం గమనించాల్సిన విషయం. అయినా సలార్ తాకిడి ఒకవైపు, 29న డెవిల్-బబుల్ గమ్ లాంటి కొత్త రిలీజుల ప్రవాహం మరోవైపు పెట్టుకుని కూడా వెంకీ ఈ మాత్రం టికెట్లు అమ్మడం విశేషమే. రవితేజ గత రీ రిలీజ్ మిరపకాయ్ ఆశించిన ఫలితం అందుకోలేదు. విక్రమార్కుడుని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు ఎందుకనో నిర్మాతలు చొరవ తీసుకోవడం లేదు. రికార్డులు కాదు కానీ వెంకీ డీసెంట్ గా ఆడితే చాలు అదే పది వేలంటున్నారు అభిమానులు.