సైలెంటుగా మొదలుపెట్టిన సైంధ‌వ్‌

సంక్రాంతి ఎంతో దూరంలో లేకపోవడంతో బరిలో ఉన్న పెద్ద సినిమాలు ప్రమోషన్ల స్పీడ్ పెంచాయి. ఎవరికి వారు తగ్గమంటూ రిలీజ్ డేట్ల మీద కట్టుబడి ఉండటంతో వాయిదా సూచనలు క్రమంగా తగ్గిపోతున్నాయి. కనీసం రోజుకు ఒకటి రిలీజయ్యేలా ప్రొడ్యూసర్ కౌన్సిల్ ఎంత ప్రయత్నిస్తున్నా వర్కౌట్ కావడం లేదట. దీంతో క్లాష్ చూస్తూ ఉండటం తప్ప ఎవరూ ఏం చేయలేని పరిస్థితి. మెల్లగా సైంధ‌వ్‌ టీమ్ రంగంలోకి దిగిపోయింది. దర్శకుడు శైలేష్ కొలను ఇంటర్వ్యూలు ఇస్తూ కంటెంట్ కు సంబంధించిన కొన్ని కీలక విషయాలతో పాటు అంచనాలు పెంచే పనిలో బిజీగా ఉన్నాడు.

వెంకటేష్ చాలా యాక్టివ్ గా మారిపోయారు. హైదరాబాద్ లోనే ఉండకుండా వేర్వేరు చోట్లకు వెళ్లి ఇంజనీరింగ్ కాలేజీలలో సాంగ్ ఈవెంట్లు చేస్తున్నారు. ఉత్సాహంగా గుళ్ళు గోపురాలు తిరిగి అభిమానులను కలుస్తున్నారు. హఠాత్తుగా హోటల్స్ కి వెళ్లి షాక్ ఇస్తున్నారు. తాజాగా ఈటీవీ ఛానల్ చేసిన ఒక ప్రోగ్రాంకు వెళ్లి తన మొదటి చిత్రం కలియుగ పాండవులు హీరోయిన్ ఖుష్బూ, లక్కీ జోడిగా పేరున్న మీనాతో కలిసి హడావిడి చేశారు. ఇది నూతన సంవత్సర కానుకగా ప్రసారం చేయబోతున్నారు. ఇదింకా మొదలే. రాబోయే రోజుల్లో వెంకీ ఇంకా హుషారుగా ఇలాంటి వాటిలో భాగం కాబోతున్నారు.

సైంధ‌వ్‌ కు కలిసి వస్తున్న అది పెద్ద అంశం ఒకటుంది. షూటింగ్ ని సాఫీగా పూర్తి చేసుకోవడం. గుంటూరు కారం ఇంకా చిత్రీకరణలోనే ఉంది. నా సామిరంగ జనవరి మొదటి వారంలో గుమ్మడికాయ కొడుతుంది. హనుమాన్ ఎక్కువగా నార్త్ మార్కెట్స్ మీద దృష్టి పెడుతోంది. ఈగల్ కన్నా ఎక్కువ బజ్ వచ్చే ఛాన్స్ సైంధ‌వ్‌ కే ఉంది. ఇవన్నీ దృష్టిలో పెట్టుకుని వెంకీ టీమ్ దానికి అనుగుణంగా మార్కెటింగ్ ప్లాన్ వేసుకుంటున్నారు. పదిహేడు కోట్లు విలువ చేసే ఇంజెక్షన్ వేస్తే తప్ప పాప ప్రాణాలు కాపాడుకోలేని ఒక తండ్రి పాత్రలో వెంకటేష్ ఫుల్ యాక్షన్ మాస్ లో కనిపించబోతున్నారు. ఫ్యాన్స్ అంచనాలు తీవ్రంగా ఉన్నాయి.