పల్లెటూరి ఊర మాస్ ‘నా సామిరంగ’

నాగార్జునను ఊర మాస్ పల్లెటూరి గెటప్ లో చూసి చాలా గ్యాప్ వచ్చేసింది. సోగ్గాడే చిన్ని నాయనా, బంగార్రాజు తర్వాత పూర్తిగా యాక్షన్ టర్న్ తీసుకోవడంతో బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు దక్కడం లేదు. అందుకే గేరు మార్చి ఈసారి మళ్ళీ గ్రామం వైపు అడుగులు వేశాడు నాగ్. డాన్స్ మాస్టర్ విజయ్ బిన్నీని దర్శకుడిగా పరిచయం చేస్తూ రూపొందుతున్న నా సామిరంగా సంక్రాంతి పండక్కు సిద్ధమవుతోంది. ఇంకా విడుదల తేదీని ఖరారు చేయలేదు కానీ అంత పోటీలోనూ వచ్చేందుకే నిర్ణయించుకుంది. ఇవాళ టీజర్ రిలీజ్ చేశారు. కథ గురించి చూచాయగా కొన్ని క్లూస్ ఇచ్చారు.

ఊరంతా మొరటోడుగా పిలుచుకునే రంగ(నాగార్జున) ఎవరినీ లెక్క చేయని తత్వం. అతనికో ఇద్దరు స్నేహితులు. అంజి(అల్లరి నరేష్) మహా అల్లరి టైపు అయితే ఇంకొకడు(రాజ్ తరుణ్) కొంచెం సాఫ్ట్. రంగకో ప్రియురాలు(ఆశికా రంగనాథ్)ఉంటుంది. ఊళ్ళో జరిగిన కొన్ని అనూహ్య సంఘటనలు, గొడవల వల్ల రంగకు అతని ఫ్రెండ్స్ కి ఎనిమిదేళ్ల గ్యాప్ వచ్చేస్తుంది. ప్రేమకు కూడా బ్రేక్ పడుతుంది. ఈలోగా జాతరలో కత్తులతో యుద్దాలు, పోట్లాటలు చోటు చేసుకుంటాయి. ఇంతకీ ఈ నలుగురికి ఉన్న కనెక్షన్ ఏంటి, విడిపోయే దాకా ఏ పరిస్థితులు దారి తీశాయనేది తెరమీద చూస్తేనే కిక్కు.

పక్కా కమర్షియల్ స్టైల్ లో నాగార్జునని ప్రెజెంట్ చేసిన తీరు ఫ్యాన్స్ అంచనాలు పెంచేలా ఉంది. అప్పుడెప్పుడో ప్రెసిడెంట్ గారి పెళ్ళాంని మించి విలేజ్ మాస్ ని ఇందులో పొందుపరిచారు. మూలకథ పోరంజు మరియం జోస్ అయినప్పటికీ భారీ మార్పులు చేశారని అర్థమవుతోంది. నాగ్, అల్లరి నరేష్ పోటాపోటీ సందడి మధ్య రాజ్ తరుణ్ స్మూత్ గా ఉన్నాడు. ఎంఎం కీరవాణి మార్కు బీజిఎం సన్నివేశాలను ఎలివేట్ చేసింది. శివేంద్ర ఛాయాగ్రహణం పల్లె అందాలను పట్టేసింది. మిర్నా మీనన్, రుక్సర్ ధిల్లాన్ మరో ఇద్దరు హీరోయిన్లు. మొత్తానికి అంచనాలు పెంచేలాగే నా సామిరంగా సందడి కనిపిస్తోంది.