అందరూ తగ్గాల్సిందేనన్న నితిన్ తండ్రి

ప్రస్తుతం టాలీవుడ్ లో బయటికి కనిపించని ఒక విధమైన అనిశ్చితి రాజ్యమేలుతోంది. బయటికి చెప్పుకోవడం లేదు కానీ నిర్మాతలు, హీరోలు దీని వల్ల ఇబ్బందులు పడుతున్న పరిస్థితికి కళ్ళముందే ఆధారాలున్నాయి. అధికారికంగా అనౌన్స్ చేసిన పెద్ద హీరో సినిమాని చెప్పా పెట్టకుండా రద్దు చేయడం ఇందులో భాగంగా జరిగిందే. ఈ నేపథ్యంలో హీరో నితిన్ తండ్రి, నిర్మాత కం పంపిణీదారులు సుధాకర్ రెడ్డి చేసిన కామెంట్స్ ఎలాంటి మార్పులు అవసరమో సూచిస్తున్నాయి. ఎక్స్ ట్రాడినరి సాంగ్ లాంచ్ లో భాగంగా టీమ్ మీడియాతో మాట్లాడింది. ఈ సందర్భంగానే సదరు ప్రస్తావన వచ్చింది.

దాని ప్రకారం ఆయన వెర్షన్ ఇలా ఉంది. ఓటిటిలు సంవత్సరానికి తమకు కావాల్సిన ముఖ్యమైన పన్నెండు సినిమాలు కొనేసుకున్నాయి. ఎప్పుడో రెండేళ్ల తర్వాత వచ్చే పెద్ద హీరోలవి ఇప్పుడే అడుగుతున్నారు. దీని వల్ల మీడియం బడ్జెట్ చిత్రాలకు చిక్కొచ్చింది. మొన్నటి దాకా ముప్పై కోట్లు పలికిన నితిన్ మూవీని ఇప్పుడు పాతికకే అడుగుతున్నారు. రేపు ఇరవైకి దిగొచ్చు. ఇకపై ప్రొడ్యూసర్లు జాగ్రత్త పడి ఖర్చులు తగ్గించుకోకపోతే ఇబ్బంది తప్పదు. అందరూ తగ్గాల్సిందే. మనమే హైప్ చేసుకుని, మనమే పెంచుకుని, మనమే పోతామంటే ఎవరేం చేయలేరు.

నిజానికి సుధాకర్ రెడ్డి అన్న మాటలు వాస్తవిక కోణంలో ఉన్నవే. కేవలం డిజిటల్ మార్కెట్ ని దృష్టిలో పెట్టుకుని ఆకాశమే హద్దుగా హీరోల రెమ్యునరేషన్లు పెరగడంతో పాటు నిర్మాతలు సైతం మితిమీరిన ఖర్చుకి తెగబడటం ఇక్కడి దాకా తీసుకొచ్చింది. హక్కుల రూపంలో ఆదాయం వస్తోందని కంటెంట్ ని నిర్లక్ష్యం చేయడం వల్ల అంతిమంగా నష్టపోతున్నది ఎవరు. ఈ ప్రశ్నను ఎవరికి వారు వేసుకుని హద్దుల్లో ఉంటే స్లంప్ ని చక్కదిద్దవచ్చు. అలా కాకుండా మేమింతే అనే ధోరణి ఉంటే మాత్రం ఇంకా దిగజారిపోతోంది. ఎక్స్ ట్రాడినరి మ్యాన్ నితిన్ స్వంత బ్యానర్ లో రూపొందిన సంగతి తెలిసిందే.