మెగా హీరోకి మూడో నెంబర్ హెచ్చరిక

వరదలు వచ్చినప్పుడు, డ్యామ్ గేట్లు ఎత్తినప్పుడు ప్రమాద హెచ్చరికలు చేసినట్టు హీరోలు తప్పటడుగులు వేస్తున్నప్పుడు బాక్సాఫీస్ కూడా వార్నింగులిస్తుంది. ఒకటి రెండుకే అలెర్ట్ అయిపోవాలి. హ్యాట్రిక్ బెల్ మ్రోగిందంటే మాత్రం అర్జెంట్ గా మేల్కోవాలి. వైష్ణవ్ తేజ్ కు అదే జరిగింది. నిన్న విడుదలైన ఆదికేశవకు రిపోర్ట్స్, రివ్యూలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. ముందు రోజు రాత్రే ప్రీమియర్లు వేసి టీమ్ కాన్ఫిడెన్స్ చూపించినప్పటికీ ప్రేక్షకులు నిర్మొహమాటంగా తిరస్కరించారు. దర్శకుడు శ్రీకాంత్ ఎన్ రెడ్డి ఇరవై ఏళ్ళ క్రితం ట్రీట్ మెంట్ తో ఆడియన్స్ ని కనీస స్థాయిలో మెప్పించలేకపోయాడు.

ఉప్పెన లాంటి జాతీయ అవార్డు సాధించిన బ్లాక్ బస్టర్ తో ఇండస్ట్రీ ఎంట్రీ ఇచ్చిన వైష్ణవ్ తేజ్ నిజానికి డ్రీం డెబ్యూ అందుకున్నాడు. వంద కోట్ల గ్రాస్ తొలి చిత్రానికి రావడమంటే మాటలు కాదు. దెబ్బకు సెటిలైపోయాడనే అందరూ అనుకున్నారు. కానీ అలా ఫిక్స్ అయినవాళ్లు ఒక లాజిక్ మిస్సైయారు. ఈ తత్వం అర్థం చేసుకోవడానికి కొండపొలం, రంగ రంగ వైభవంగా బాగా ఉపయోగపడ్డాయి. అయినా కూడా ముచ్చటగా మూడోసారి లెక్క తప్పింది.

ఆదికేశవ ఒక విషయాన్ని స్పష్టం చేసింది. వైష్ణవ్ కు స్వంతంగా ఫ్యాన్ బేస్ ఇంకా ఏర్పడలేదు. మెగాభిమానులందరూ మద్దతు ఇవ్వడం లేదని మార్నింగ్ షో కలెక్షన్లు చూస్తే అర్థమైపోయింది. అంతెందుకు వరుణ్ తేజ్ కు వరస ఫ్లాపుల ప్రభావం మొన్న గాండీవధారి అర్జున మీద చాలా తీవ్రంగా పడింది. ఓటిటిలో వచ్చినా కూడా ఎవరూ పట్టించుకోలేదంటే అర్థం చేసుకోవచ్చు. అలాంటిది వైష్ణవ్ తేజ్ తనకు ఎంతమాత్రం నప్పని మాస్ ని ఎంచుకుని జనం గుడ్డిగా చూసేస్తారనుకుని రాంగ్ స్టెప్ వేయడం కెరీర్ కి కుదిపేస్తుంది. ఇకనైనా జాగ్రత్త పడకపోతే నిండా మునగడమే ఉంటుంది.