తారక్ ఫ్యాన్స్ ఇంత లైట్ తీసుకున్నారేంటి?

గత ఏడాది మహేష్ బాబు పుట్టిన రోజు సందర్భంగా ‘పోకిరి’ సినిమాను పెద్ద ఎత్తున రీ రిలీజ్ చేయడం.. అది అదిరిపోయే రెస్పాన్స్ తెచ్చుకోవడం.. ఇక అప్పట్నుంచి టాలీవుడ్లో రీ రిలీజ్ ట్రెండ్ బాగా ఊపందుకోవడం తెలిసిందే. ఈ 15 నెలల కాలంలో ఈ కోవలో చాలా సినిమాలే రిలీజయ్యాయి. మహేష్ బాబు మరో హిట్ మూవీ ‘బిజినెస్‌మ్యాన్’ సైతం మంచి స్పందన తెచ్చుకుంది. పవన్ కళ్యాణ్ చిత్రాలు ‘జల్సా’, ‘ఖుషి’లకు అయితే వేరే లెవెల్ రెస్పాన్స్ వచ్చింది.

బాలయ్య ‘చెన్నకేశవరెడ్డి’, ఎన్టీఆర్ ‘సింహాద్రి’ సైతం పర్వాలేదనిపించాయి. ఇంకా కొన్ని సినిమాలేవో బాగా ఆడాయి. ఐతే అతి సర్వత్ర వర్జయేత్ అన్నట్లుగా.. ఈ రీ రిలీజ్‌ల వరద మరీ ఎక్కువ అయిపోవడంతో నెమ్మదిగా అభిమానులు లైట్ తీసుకోవడం మొదలుపెట్టారు. ఈ ప్రభావం ‘యోగి’ లాంటి సినిమాల విషయంలో స్పష్టంగా కనిపించింది. ఇప్పుడు ‘అదుర్స్’ సినిమా పరిస్థితి మరింత ఇబ్బందికరంగా మారింది.

విశ్వక్సేన్‌ సైతం ప్రమోట్ చేసిన ‘అదుర్స్ 4కే’ షోలకు రెస్పాన్స్ ఏమాత్రం ఆశాజనకంగా లేదు. ఎన్టీఆర్ అభిమానులే ఈ సినిమాను లైట్ తీసుకున్నారు. ఎక్కడా షోలు ఫుల్ అయిన సంకేతాలు కనిపించట్లేదు. ఈ రోజు  సినిమా రీ రిలీజ్ అవుతుంటే సోషల్ మీడియాలో కూడా సౌండ్ లేదు. తారక్ ఫ్యాన్స్ పూర్తిగా సైలెంట్ అయిపోయారు.

మామూలుగా రీ రిలీజ్‌ డేట్‌కు కొన్ని రోజుల ముందు రెస్పాన్స్ సరిగా లేదంటే ఫ్యాన్స్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని బుకింగ్స్, కలెక్షన్స్ పెంచడానికి ట్రై చేస్తారు. ‘సింహాద్రి’ విషయంలో అలా జరిగింది కూడా. కానీ ‘అదుర్స్’కు వచ్చేసరికి అలాంటి ప్రయత్నమేమీ జరగలేదు. చాలా షోలు జనం లేక వెలవెలబోయే పరిస్థితి ఉన్నా పట్టించుకోవట్లేదు. సోషల్ మీడియాలో సైతం ‘అదుర్స్’ ప్రస్తావనే తేకుండా సైలెంట్‌గా ఉన్నారు అభిమానులు.