కీరవాణికి మళ్ళీ పాత కాలపు వైభవం

మాములుగా ఎంత పెద్ద లెజెండరీ సంగీత దర్శకుడైనా కెరీర్ లో ఒక దశ దాటాక అగ్ర హీరోల సినిమాలు తగ్గిపోతాయి. దీనికి ఎవరూ మినహాయింపు కాదు. అది గుర్తించగానే మెల్లగా రిటైర్మెంట్ వైపు అడుగులు వేయడం సహజం. కానీ ఎంఎం కీరవాణికి మాత్రం రివర్స్ లో జరుగుతోంది. గత కొన్నేళ్లుగా రాజమౌళికి తప్ప ఇంకెవరికి బెస్ట్ మ్యూజిక్ ఇవ్వడం లేదన్న కామెంట్స్ కి భిన్నంగా స్టార్ హీరోలు కోరి మరీ ఆయనకు ఓటు వేస్తుండటం గమనించాల్సిన విషయం. ముఖ్యంగా ఆర్ఆర్ఆర్ నాటు నాటు పాటకు ఆస్కార్ అవార్డు సాధించాక లేట్ ఇన్నింగ్స్ ఇంకా బ్రహ్మాండంగా జరుగుతోంది.

కీరవాణికి ప్యాన్ ఇండియా మూవీస్ తో పాటు టాలీవుడ్ స్ట్రెయిట్ సినిమాలు చేతిలో ఉన్నాయి. వాటిలో వరస క్రమంలో చెప్పుకుంటే ముందుగా వచ్చేది నాగార్జున ‘నా సామి రంగా’. ఒకప్పుడు వారసుడు, ప్రెసిడెంట్ గారి పెళ్ళాం, అల్లరి అల్లుడు, ఘరానా బుల్లోడు లాంటి ఛార్ట్ బస్టర్స్ ఇచ్చిన హీరోతో మళ్ళీ చేతులు కలపడం ఫ్యాన్స్ కి కొత్త ఉత్సాహాన్ని ఇస్తోంది. పవన్ కళ్యాణ్ ‘హరిహర వీరమల్లు’ దగ్గరలో విడుదల లేదు కానీ వచ్చే ఏడాది రావడం కన్ఫర్మే. మొదటిసారి పవర్ స్టార్ కి ఎలాంటి టెర్రిఫిక్ స్కోర్ ఇస్తాడోననే ఆసక్తి సగటు అభిమానుల్లోనే కాదు మాములు ప్రేక్షకుల్లోనూ తీవ్రంగా ఉంది.

ఇక మెగాస్టార్ చిరంజీవి ‘విశ్వంభర’ అత్యంత భారీ బడ్జెట్ తో రూపొందుతున్న సినిమా. బింబిసారకు ఇచ్చిన అవుట్ ఫుట్ కి సంతృప్తి చెందిన వశిష్ట మళ్ళీ ఆయన్నే ఎంచుకున్నాడు. ఘరానా మొగుడు, ఆపద్బాంధవుడు లాంటి ఎవర్ గ్రీన్ ఆల్బమ్స్ ఈ కలయికలో ఉన్నాయి. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మహేష్ బాబు రాజమౌళి కాంబినేషన్ లో రాబోయే ఫారెస్ట్ అడ్వెంచర్ మూవీ ‘ఎస్ఎస్ఎంబి 29’ మరో మైలురాయి. ప్రపంచవ్యాప్తంగా మార్కెట్ కాబోయే ఈ  ప్రాజెక్టుకి కీరవాణి ప్రాణం పెట్టేస్తారు. ఇంత లేటు వయసులో ఈ స్థాయిలో బిజీగా ఉన్న సీనియర్ మోస్ట్ సంగీత దర్శకులు ఒక్క కీరవాణి మాత్రమే.