ఆ కామెంట్‌కు హరీష్ శంకర్ సమాధానం

టాలీవుడ్ దర్శకుల్లో సోషల్ మీడియాలో ఎక్కువ యాక్టివ్‌గా ఉండేది ఎవరంటే హరీష్ శంకర్ అనే సమాధానం వస్తుంది. సోషల్ మీడియాలోనే కాదు.. టాలీవుడ్లో జరిగే అనేక సినిమా వేడుకల్లో కూడా ఆయన కనిపిస్తుంటారు. గత ఏడాది కాలంలో హరీష్ శంకర్ అతిథిగా పాల్గొన్న సినిమా కార్యక్రమాలు డబుల్ డిజిట్లోనే ఉంటాయి.

దర్శకుడిగా ఆ స్థాయిలో ఉండి.. ఇలా ప్రతి సినిమా ఈవెంట్‌కు వచ్చేస్తుంటాడేంటి.. మిగతా దర్శకుల్లా లెవెల్ మెయింటైన్ చేయడేంటి అనే కామెంట్లు సోషల్ మీడియాలో వినిపిస్తుంటాయి. అలాగే హరీష్ శంకర్ అంత ఖాళీయా అంటూ కౌంటర్లు కూడా పడుతుంటాయి. ఈ కామెంట్లకు, కౌంటర్లకు హరీష్ శంకర్ తాజాగా సమాధానం ఇచ్చాడు. ఈ నెల 17న విడుదల కానున్న ‘స్పార్క్’ సినిమా ప్రి రిలీజ్ ఈవెంట్‌కు ముఖ్య అతిథిగా హాజరైన హరీష్.. ఈ టాపిక్ మీద మాట్లాడాడు.

‘‘దర్శకుడిగా నేను నిలదొక్కుకుంటున్న సమయంలో పూరి జగన్నాథ్, వి.వి.వినాయక్ లాంటి పెద్ద దర్శకులు నన్ను ప్రోత్సహించారు. నా సీనియర్లు చేసినట్లే ఇప్పుడు నేను కొత్త ప్రతిభను ఎంకరేజ్ చేసేందుకు ప్రతి సినిమా ఈవెంట్‌కూ వెళ్తున్నా. ప్రతి సినిమా ఈవెంట్‌కూ వెళ్తున్నావేంటి అని చాలామంది నన్ను అడుగుతుంటారు. సోషల్ మీడియాలో కూడా ఇలా ప్రశ్నిస్తూ పోస్టులు పెడుతుంటారు.

కానీ కొత్త వాళ్లకు ప్రోత్సాహం అందించాలనే మంచి ఉద్దేశంతోనే ఎవరు అడిగినా కాదనకుండా సినిమా వేడుకలకు వెళ్తుంటా’’ అని హరీష్ శంకర్ చెప్పాడు. ‘స్పార్క్’ సినిమా టీంలో తనకు సుహాసిని, మెహ్రీన్, అనంత్ శ్రీరామ్, హేషమ్ అబ్దుల్.. ఇలా కొద్దిమందే తెలుసని.. సినిమా రిలీజయ్యాక అందరికీ మంచి గుర్తింపు రావాలని హరీష్ ఆకాంక్షించాడు. విక్రాంత్ హీరోగా నటిస్తూ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించిన ‘స్పార్క్’లో మెహ్రీన్, రుక్సర్ థిల్లాన్ కథానాయికలుగా నటించారు.