అదిరిపోయే ఆలోచన 112 రూపాయలు

స్టార్ క్యాస్టింగ్ లేకుండా తక్కువ బడ్జెట్ తో తీసే సినిమాలకు మంచి రన్ రావాలంటే సామాన్యులకు టికెట్ రేట్లు అందుబాటులో ఉండాలి. ప్రభాస్, పవన్ కళ్యాణ్ లాంటి బడా హీరోలకు ఏం చేయనక్కర్లేదు. టాక్ ఎలా ఉన్నా మొదటి వారం భారీగా వసూళ్లు రాబడతారు. కానీ జనాలకు అంతగా తెలియని తారాగణంతో తీసినప్పుడు సరసమైన ధర చాలా అవసరం. కీడా కోలా టీమ్ అదే చేస్తోంది. ఈ రోజు నుంచి తెలంగాణ మల్టీప్లెక్సుల్లో టికెట్ రేట్లను కేవలం 112 రూపాయలకు సవరించి ఎక్కువ శాతం ప్రేక్షకులు వచ్చేలా ఎత్తుగడ వేసింది. మాములుగా వీటి రేట్ 150 నుంచి 200 మధ్యలో ఉంటుంది.

అనూహ్యం ఏంటంటే మహేష్ బాబు ఏఎంబి సూపర్ ప్లెక్స్ లో కూడా ఇదే రేట్ పెట్టడం. ఇప్పటిదాకా ఈ థియేటర్ సముదాయంలో ఇంత తక్కువ ధర ఎప్పుడూ లేదు. సగానికి పైగా డిస్కౌంట్ ఇవ్వడం వెనుక సదరు యాజమాన్యంతో పాటు డిస్ట్రిబ్యూటర్, నిర్మాతల చొరవ చాలా ఉంటుంది. సింగల్ స్క్రీన్ లో కూడా లేని ఇంత తక్కువ మొత్తానికి మల్టీప్లెక్స్ అనుభూతి దక్కుతుందంటే ఎవరు మాత్రం వదులుకుంటారు. ఎల్లుండి జపాన్, జిగర్ తండా డబుల్ ఎక్స్ ఆపైన ఆదివారం టైగర్ 3 విడుదల కాబోతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకునే కీడా కోలా మేకర్స్ తెలివైన నిర్ణయం తీసుకున్నారు.

రాబోయే రోజుల్లో కూడా ఈ తరహా స్ట్రాటజీలు కొనసాగించాలి. బాలీవుడ్ లో ఈ ట్రెండ్ ఎప్పటి నుంచో ఉంది. ఒక్కోసారి బజ్ లేదనుకుంటే రిలీజ్ రోజే వన్ ప్లస్ వన్ ఆఫర్లు ఇచ్చిన దాఖలాలు బోలెడు. గదర్ 2కి సైతం నెల రోజులయ్యాక 100 రూపాయల టికెట్లు అందుబాటులోకి తీసుకొచ్చారు. ఎటొచ్చి ఆంధ్రప్రదేశ్ లో ఉన్న నియమ నిబంధనలు, పరిమితుల వల్ల మల్టీప్లెక్సులు మరీ తక్కువ రేటుకి టికెట్లు ఇవ్వలేకపోతున్నాయి. ఇటీవలి కాలంలో పివిఆర్ సంస్థ తరచు స్నాక్స్ ధరలను సవరించి 99 రూపాయలకు అమ్మడం మంచి ఫలితాన్ని ఇచ్చింది. ఇలాంటివి రెగ్యులర్ గా ప్లాన్ చేస్తే అందరికీ మంచిది.