ఖైదీ-2 గురించి క్రేజీ అప్‌డేట్స్‌

తమిళ దర్శకుడు లోకేష్‌ కనకరాజ్‌కు తెలుగులో బంపర్‌ క్రేజ్‌ రావడానికి ప్రధాన కారణం ‘ఖైదీ’ మూవీనే. కార్తి హీరోగా అతను రూపొందించిన ఈ చిత్రం తమిళంలోనే కాక తెలుగులోనూ ఘనవిజయం సాధించింది. కాల క్రమంలో కల్ట్‌ స్టేటస్‌ తెచ్చుకుంది. విక్రమ్‌లో ఖెదీ సినిమాకు కనెక్షన్‌ పెట్టడంతో ఈ సినిమా క్రేజ్‌ ఇంకా పెరిగింది. ఖైదీని లోకేష్‌ కెరీర్లో బెస్ట్‌ మూవీగా చూస్తారు అభిమానులు.

దానికి సీక్వెల్‌ తీస్తానని లోకేష్‌ ఎప్పట్నుంచో చెబుతున్న సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో ఆ విశేషాలే పంచుకున్నాడు. లియో తర్వాత రజినీకాంత్‌తో సినిమా చేయబోతున్న లోకేష్‌.. దాని తర్వాత వెంటనే ఖైదీ-2 తీస్తానని వెల్లడించాడు. ఢిల్లీ గతంతో పాటు, వర్తమానానికి ముడి పెడుతూ ఈ కథ ఉంటుందని చెప్పాడు.

లోకేష్‌ సినిమాటిక్‌ యూనివర్శ్‌తో ఖైదీకి కచ్చితంగా కనెక్షన్‌ ఉంటుందని చెప్పిన లోకేష్‌.. విక్రమ్‌లో విలన్‌గా కనిపించిన సంతానం చనిపోయాడు కాబట్టి డ్రగ్స్‌ డిస్ట్రిబ్యూషన్‌ ఇంకొకరి చేతుల్లోకి వెళ్తుందని.. ఆ విలన్‌ ఎవరు అనేది సర్ప్రైజ్‌ అని లోకేష్‌ తెలిపాడు. ఖైదీ-2లో అనేక ఆశ్చర్యకర, కొత్త పాత్రలు ఉంటాయని.. ఆ సినిమా చేయడం కోసం ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నానని లోకేష్‌ తెలిపాడు.

లియో పాత్ర ఎల్‌సీయూలో హీరోనా విలనా అన్నది కూడా ఇప్పుడు చెప్పనని.. తర్వాత ప్రేక్షకులు తెలుసుకుంటారని చెప్పాడు. ఖైదీ-2 తర్వాత విక్రమ్‌-2, లియో-2 సినిమాలు కూడా చేస్తానని.. వీటితో పాటు రోలెక్స్‌ మీద ప్రత్యేకంగా ఓ సినిమా ఉంటుందని అతనన్నాడు. లియో సినిమాకు నెగెటివ్‌ టాక్‌ రావడంపై లోకేష్‌ స్పందిస్తూ.. దీనిపై కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేశారన్నాడు.