‘గుంటూరు కారం’లో ఆయన.. తమన్ క్రెడిటే

మహేష్ బాబు, త్రివిక్రమ్ శ్రీనివాస్‌ల క్రేజీ కాంబినేషన్లో తెరకెక్కుతున్న ‘గుంటూరు కారం’ సినిమాకు సంబంధించి అనేక మార్పులు చేర్పులు జరిగిన సంగతి తెలిసిందే. ఒకసారి షూట్ మొదలు పెట్టాక ఈ చిత్రానికి స్క్రిప్టు మారింది. ఫైట్ మాస్టర్లు మారారు. హీరోయిన్ మారింది. అలాగే సినిమాటోగ్రాఫర్ సైతం మారాడు. త్రివిక్రమ్ గత కొన్ని చిత్రాలకు పని చేసిన పి.ఎస్.వినోద్ ఈ సినిమా నుంచి అర్ధంతరంగా తప్పుకున్నాడు.

దీంతో ఆయన స్థానంలోకి మనోజ్ పరమహంస వచ్చాడు. తమిళంలో ‘బీస్ట్’, ‘లియో’ సహా ఎన్నో భారీ చిత్రాలకు పని చేసిన అనుభవం మనోజ్‌కు ఉంది. తెలుగులో కూడా రేసుగుర్రం, కిక్-2, బ్రూస్‌లీ, రాధేశ్యామ్ లాంటి పెద్ద సినిమాలకు పని చేశాడు మనోజ్. ఐతే మధ్యలో ఒకరు వదిలేసిన సినిమాలోకి మనోజ్ లాంటి బిజీయెస్ట్ సినిమాటోగ్రాఫర్ రావడం ఒకింత ఆశ్చర్యం కలిగించేదే. ఐతే అదంతా తమన్ వల్లే సాధ్యపడింది అంటున్నాడు మనోజ్.

తమన్‌తో తనకు మంచి అనుబంధం ఉందని.. నీరం (తెలుగులో వైశాలి) రోజుల నుంచి తామిద్దరం చాలా సినిమాలకు కలిసి పని చేస్తున్నామని ఒక ఇంటర్వ్యూలో మనోజ్ పరమహంస తెలిపాడు. తాను పని చేస్తున్న‘లియో’ చివరి దశలో ఉండగా తమన్.. తనకు ‘గుంటూరు కారం’ సినిమా ఆఫర్ చేశాడని మనోజ్ చెప్పాడు. ఐతే అప్పటికే తాను నిఖిల్ సిద్దార్థ సినిమా ‘స్వయంభు’కు కమిటయ్యానని.. ఐతే ఆ సినిమా ప్రి ప్రొడక్షన్‌కు టైం పట్టేలా ఉండటంతో ఆ నిర్మాతను తాము ఒప్పించుకుంటాం అని చెప్పి తమన్ ‘గుంటూరు కారం’లోకి తనను తీసుకొచ్చినట్లు మనోజ్ వెల్లడించాడు.

ఇక మహేష్ బాబుతో పని చేయడం గొప్ప అనుభవం అని చెబుతూ.. లైటింగ్, యాంగిల్స్ సహా సినిమాటోగ్రఫీకి సంబంధించి మహేష్ బాబుకు ఉన్న క్లారిటీ చూసి తాను ఆశ్చర్యపోయానని.. దీని గురించి ఇంత అవగాహన ఉన్న హీరోను తాను చూడలేదని మనోజ్ తెలిపాడు. ఒక దశలో ‘గుంటూరు కారం’ నుంచి తమన్ కూడా తప్పుకుంటాడని వార్తలు రాగా.. ఈ సినిమాలోకి మనోజ్ లాంటి ఏస్ సినిమాటోగ్రాఫర్‌ను తీసుకురావడంలో తమన్ క్రెడిట్ ఉందంటే విశేషమే.