‘గ్యాంగ్ లీడర్’ భామ ఎట్టకేలకు..

ప్రియాంక అరుల్ మోహన్.. గత ఏడాది తెలుగు కుర్రాళ్ల గుండెలకు గాయం చేసిన అమ్మాయి. నాని సినిమా ‘గ్యాంగ్ లీడర్’తో తెలుగు తెరకు పరిచయం అయ్యిందీ మలయాళ అమ్మాయి.

‘గ్యాంగ్ లీడర్’ అనుకున్న స్థాయిలో ఆడకపోవడం వల్ల ప్రియాంకకు బ్రేక్ రాలేదు కానీ.. ఒక స్టార్ హీరోయిన్ కాగల లక్షణాలు ఆమెలో కచ్చితంగా ఉన్నాయి. కాకపోతే రెగ్యులర్ గ్లామర్ హీరోయిన్లకు ఆమె భిన్నం. ‘అందాల రాక్షసి’లో లావణ్య త్రిపాఠి లాగే ప్రియాంకకు కూడా ఒక ప్రత్యేకమైన అందంతో కుర్రాళ్లను ఆకట్టుకుంది. చాలామంది ఆ సినిమా చూసి ప్రియాంకతో ప్రేమలో పడిపోయారు.

కానీ మన దగ్గర అవకాశాలు రావాలంటే బాక్సాఫీస్ సక్సెసే ప్రామాణికం. పైగా ప్రియాంక తొలి సినిమాలో గ్లామర్ విందు కూడా చేయలేదు. దీంతో తనకు ఆ తర్వాత ఒక్క అవకాశం కూడా రాలేదు. దాదాపు ఏడాది గ్యాప్ వచ్చేయడంతో ప్రియాంకకు ఇక తెలుగులో అవకాశాలు లేనట్లే అని అంతా ఫిక్సయిపోయారు.

ఐతే ప్రియాంక ఎట్టకేలకు రెండో అవకాశం సంపాదించినట్లు సమాచారం. యువ కథానాయకుడు నిఖిల్‌కు జోడీగా ప్రియాంక నటించనుందట. అతను సుకుమార్, అల్లు అరవింద్‌ల ఉమ్మడి నిర్మాణంలో.. సుక్కు శిష్యుడు పల్నాటి సూర్యప్రతాప్ రూపొందించనున్న ‘18 పేజెస్’ సినిమాలో నటించనున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రానికి కథానాయికగా రకరకాల పేర్లు వినిపించాయి. ఐతే చివరికి నిఖిల్‌కు జోడీగా ప్రియాంకను ఖరారు చేసినట్లు సమాచారం. త్వరలోనే దీనిపై అధికారిక ప్రకటన రానుందట.

ఇంతకుముందు సుక్కు స్క్రిప్టుతో ‘కుమారి 21 ఎఫ్’ తీసిన సూర్యప్రతాప్.. ఆ తర్వాత మరే సినిమా తీయలేదు. మళ్లీ గురువు కథతోనే సినిమా చేయబోతున్నాడు. ఇది ఒక డైరీ నేపథ్యంలో సాగే ప్రేమకథ అని సమాచారం. కథ కొంచెం పాత తరహాలో ఉన్నప్పటికీ.. ట్రీట్మెంట్ కొత్తగా ఉంటుందట. సుకుమార్, అల్లు అరవింద్ కలిసి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటంతో దీనిపై ప్రత్యేక ఆసక్తి నెలకొంది.