అక్టోబర్ 6 మీడియం సినిమాల జాతర  

అతివృష్టి లేదా అనావృష్టి వద్దని ఎందరు మొత్తుకుంటున్నా మన నిర్మాతలు మాట వినే పరిస్థితిలో లేరు. వస్తే ఒకేసారి మీద పడటం లేదా దిక్కు మొక్కు లేకుండా శుక్రవారాలను అనాథలా వదిలేయడం ఈ మధ్య తరచుగా జరుగుతోంది. సెప్టెంబర్ లో అలా రెండు ఫ్రైడేలు అన్యాయంగా వృథా అయిపోయాయి. రెండు డబ్బింగ్ సినిమాలు మార్క్ ఆంటోనీ, సప్త సాగరాలు దాటి వాటిని ఉపయోగించుకోలేక చతికిల పడ్డాయి. సలార్ వాయిదా పడటం ఈ పరిస్థితికి కారణమని చెప్పొచ్చు. అందుకే చివరి వారం ఇష్టం లేకపోయినా స్కంద, చంద్రముఖి 2, పెదకాపు 1 పరస్పరం తలపడాల్సిన సిచువేషన్ వచ్చి పడింది.

ఇక అసలు విషయానికి వద్దాం. దసరా నుంచి స్టార్ హీరోల దండయాత్ర మొదలవుతుంది కాబట్టి మొదటి వారంని వాడేసుకోవాలని మీడియం రేంజ్ నిర్మాతలు డిసైడ్ కావడంతో అన్నీ అక్టోబర్ 6న మూకుమ్మడిగా దిగబోతున్నాయి. సుధీర్ బాబు ‘మామా మశ్చీంద్ర’ ట్రైలర్ వచ్చాక అంచనాలు పెరిగాయి. ట్రిపుల్ రోల్ లో ఏదో డిఫరెంట్ గా చేసిన ఫీల్ అయితే కలిగింది. కిరణ్ అబ్బవరం ‘రూల్స్ రంజన్’కు బిజినెస్ బాగా జరిగింది. కీలక ఏరియాలను మైత్రి పంపిణి చేస్తోంది. నవ్వు రాకపోతే డబ్బులు వెనక్కు ఇస్తానని నాగవంశీ ఛాలెంజ్ చేసిన ‘మ్యాడ్’ మీద యూత్ ఆసక్తిగానే ఉంది. వాళ్లకు కనెక్ట్ అయితే హిట్టే.

కలర్స్ స్వాతి, నవీన్ చంద్ర నటించిన ‘మంత్ అఫ్ మధు’ మీద మెల్లగా ఫ్యామిలీ ఆడియన్స్ దృష్టి మళ్లుతోంది. ముత్తయ్య మురళీధరన్ బయోపిక్ ‘800’ని నిర్మాత శివలెంక కృష్ణప్రసాద్ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. నయనతార జయం రవిల ‘గాడ్’ సైతం రంగంలోకి దిగుతోంది. వీటికి వారం ముందే మూడు పెద్ద సినిమాలు వచ్చి ఉంటాయి కాబట్టి థియేటర్ల సర్దుబాటు అంత సులభంగా ఉండవు.  బాలీవుడ్ నుంచి మిషన్ రాణిగంజ్, దోనో, థాంక్ యు ఫర్ కమింగ్ లు మంచి ప్లానింగ్ తో వస్తున్నాయి. ఏ సెంటర్లలో వీటితో ఇబ్బంది ఉంటుంది. చూస్తుంటే జనాలు ఏది చూడాలో డిసైడ్ చేసుకోవడానికే అయోమయపడేలా ఉన్నారు. వీటిలో విజేతలు ఎవరవుతారో.