తొందరపాటు నిర్ణయాలు వద్దు అఖిల్

ఎన్నో ఆశలు పెట్టుకుని ఒళ్ళు హూనం చేసుకుని మరీ నటించిన ఏజెంట్ దారుణంగా నిరాశ పరచడంతో అఖిల్ నెలల తరబడి అజ్ఞాతంలోనే ఉన్నాడు. మొన్న ఏఎన్ఆర్ శతజయంతి వేడుకల్లో కనిపించడం తప్పించి అంతకు ముందు కనీసం మీడియాకు సైతం అందుబాటులోకి రాలేదు. యువి క్రియేషన్స్ కొత్త దర్శకుడు అనిల్ తో ప్లాన్ చేసుకున్న ఫాంటసీ మూవీ ఎప్పుడు మొదలవుతుందో అంతు చిక్కడం లేదు. ఈసారి మాస్ టచ్ ఉన్న కమర్షియల్ సబ్జెక్టు చెయ్యమని ఫ్యాన్స్ డిమాండ్ చేస్తున్నారు కానీ అఖిల్ మనసులో ఏముందో బయటికి చెప్పడం లేదు.

ఈ కాంబో పక్కానే కానీ వీలైనంత త్వరగా మొదలుపెట్టడం అవసరం. ఇదిలా ఉండగా అఖిల్ కు తమిళ డైరెక్టర్ లింగుస్వామి ఒక లైన్ చెప్పాడని, దానికి సానుకూల స్పందన వచ్చిందనే వార్త ఫ్యాన్స్ ని ఖంగారు పెడుతోంది. ఎందుకంటే రామ్ కి ది వారియర్ లాంటి సూపర్ డిజాస్టర్ ఇచ్చింది ఈయనే. ఒకప్పుడంటే రన్, పందెం కోడి లాంటి బ్లాక్ బస్టర్స్ ఇచ్చాడు కానీ తర్వాత ఫామ్ కోల్పోయారు. కోలీవుడ్ స్టార్ హీరోలే ఆసక్తి చూపించడం లేదు. అయినా రామ్ గుడ్డిగా అవకాశం ఇస్తే దాన్ని వృథా చేసుకున్నారు. ఇప్పుడు అఖిల్ తో అంటే సహజంగానే టెన్షన్ కలుగుతుంది.

అయితే మునుపటిలా అఖిల్ తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం లేదు. నాన్న నాగార్జునతో చర్చిస్తున్నాడు. లింగుస్వామి, మురుగదాస్ లాంటి వాళ్ళను గుడ్డిగా నమ్మలేం. ఏ మాత్రం ఏమరుపాటుగా ఉన్నా, మొహమాటం కోసం ఒప్పుకున్నా ఫలితం తేడా కొట్టేస్తుంది. అందుకే ఆచితూచి నిర్ణయాలు తీసుకోవాలి. నాగచైతన్యకు మంచి ప్యాన్ ఇండియా సినిమాతో పాటు క్రేజీ కాంబినేషన్ తోడయ్యింది. నాగార్జున నా సామి రంగా అంటూ కాస్త లేట్ అయినా పర్ఫెక్ట్ టీమ్ ని ఎంచుకున్నాడు. ఇక మిగిలింది అఖిలే. డెసిషన్లు కరెక్ట్ గా ఉంటేనే ఫలితాలు గొప్పగా వస్తాయి. ఇదే ఇప్పుడు పాటించాల్సింది.