అప్పుడు విశాల్‌పై జ‌రిగింది త‌ప్పుడు ప్ర‌చార‌మా?

తెలుగు వాడైన త‌మిళ న‌టుడు విశాల్ త‌న కొత్త చిత్రం మార్క్ ఆంటోనీ ప్ర‌మోష‌న్ల‌లో భాగంగా బుధ‌వారం హైద‌రాబాద్‌కు వ‌చ్చాడు. మ‌న రిపోర్ట‌ర్లు సురేష్ బాబును అడిగిన‌ట్లే తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్ర‌బాబు నాయుడు అరెస్ట్ విష‌యం మీద విశాల్‌ను కూడా ప్ర‌శ్న‌లు అడిగేశారు. సినిమా ప్ర‌మోష‌న్ కోసం వ‌చ్చిన త‌న‌ను రాజ‌కీయాల గురించి అసంద‌ర్భ‌మైన‌ ప్ర‌శ్న అడ‌గడం ఏంటి అనుకోకుండా విశాల్.. ప‌రిణ‌తితో కూడిన స‌మాధానం చెప్పాడు.

తాను సినిమా హీరోనైన‌ప్ప‌టికీ.. ఇంటికి వెళ్తే అంద‌రిలాంటి మామూలు మ‌నిషే అని.. చంద్ర‌బాబు నాయుడు లాంటి పెద్ద నాయ‌కుడికే ఈ ప‌రిస్థితి వ‌స్తే.. త‌న లాంటి సామాన్యుడి సంగ‌తేంటా అన్న భ‌యం త‌న‌కు క‌లిగింద‌ని విశాల్ చెప్ప‌డం విశేషం. చంద్ర‌బాబు అరెస్ట్ వ్య‌వ‌హారాన్ని ఇంకొంచెం మెరుగ్గా డీల్ చేసి ఉండొచ్చ‌నే అభిప్రాయాన్ని విశాల్ వ్య‌క్తం చేశాడు. 

చంద్ర‌బాబు మీద త‌న‌కున్న మంచి అభిప్రాయాన్ని కూడా విశాల్ ఈ సంద‌ర్భంగా బ‌య‌ట‌పెట్టాడు విశాల్. ఐతే ఈ వ్యాఖ్య‌లు చూశాక విశాల్ మీద రెండేళ్ల కింద‌ట జ‌రిగిన ప్ర‌చారం గురించి అంద‌రికీ గుర్తుకొచ్చే ఉంటుంది. అత‌ను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మ‌ద్ద‌తుదారు అన్న‌ట్లు.. ఆ పార్టీ త‌ర‌ఫున కుప్పంలో చంద్ర‌బాబు మీదే వ‌చ్చే అసెంబ్లీ ఎన్నిక‌ల్లో పోటీ చేయ‌నున్న‌ట్లు జోరుగా ప్ర‌చారం జ‌రిగింది.

ఈ విష‌యాన్ని వైసీపీ వాళ్లే ఎక్కువ‌గా ప్ర‌చారంలోకి తీసుకెళ్లారు. డేరింగ్ అండ్ డాషింగ్ అని పేరున్న విశాల్.. వైసీపీకి మ‌ద్ద‌తు ఇవ్వ‌డం గురించి అప్ప‌ట్లో పెద్ద చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగానే విశాల్ రెడ్డి సామాజిక వ‌ర్గానికి చెందిన వ్య‌క్తి అనే విష‌యం కూడా ప్ర‌స్తావ‌న‌కు వ‌చ్చింది. కానీ విశాల్ తాజా వ్యాఖ్య‌ల‌ను బ‌ట్టి చూస్తే అప్పుడు జ‌రిగిందంతా అబ‌ద్ధ‌పు ప్ర‌చారం అని భావించ‌వ‌చ్చు.