బోల్డ్ బేబీ ఓటిటిలో వచ్చేస్తోంది

ఈ సీజన్లో తెలుగు స్ట్రెయిట్ సినిమాలకు సంబంధించి అతి పెద్ద బ్లాక్ బస్టర్ గా నిలిచిన బేబీ ఆగస్ట్ 25న ఆహా ఓటిటిలో ప్రీమియర్లు మొదలుపెట్టనుంది. ఒకవేళ ఇంకా త్వరగా కావాలంటే వాళ్ళ గోల్డ్ ఆప్షన్ కి ఆప్ గ్రేడ్ చేసుకుంటే పన్నెండు గంటల ముందే చూసుకోవచ్చట. దాని వల్ల పెద్దగా తేడా ఏం రాదనుకోండి. నిజానికి ఎనిమిది వారాల గ్యాప్ తో స్ట్రీమింగ్ ఉండేలా నిర్మాత ఎస్కెఎన్ ముందే ఫిక్స్ చేసుకున్నారని టాక్ వచ్చింది. కానీ మరీ అంత ఆలస్యమైతే క్రేజ్ తగ్గిపోయి రెస్పాన్స్ విషయంలో తేడాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి దాన్ని ఆరువారాలకు కుదించేసుకున్నారు.

థియేట్రికల్ గా ఫైనల్ రన్ కు దగ్గరలో ఉన్న బేబీ వంద కోట్ల గ్రాస్ అందుకునేందుకు కష్టపడుతోంది. డెబ్భై అయిదు దాకా ప్రయాణం సాఫీగా సాగినప్పటికీ బ్రో, జైలర్, భోళా శంకర్ లతో పాటు వీటికన్నా ముందు భారీ హాలీవుడ్ మూవీస్ బాక్సాఫీస్ మీద దండెత్తడంతో బేబీ నెమ్మదించక తప్పలేదు. అయినా సరే తొంభై కోట్ల గ్రాస్ ఇంత చిన్న చిత్రానికి రావడమంటే మాటలు కాదు. పోటీ విషయంలో గత కొంత కాలంగా వెనుకబడిన ఆహాకు ఇటీవలే సామజవరగమన మంచి ఆక్సిజన్ లా పని చేసింది. ఇప్పుడీ బేబీ తిరిగి ట్రాక్ లో తెస్తుందనే ధీమాలో ఆహా టీమ్ ఉంది.

ఇవన్నీ ఎలా ఉన్నా బడ్జెట్ ఫిలిం మేకర్స్ కు బేబీ ఒక గొప్ప పాఠంగా నిలిచింది. ఖర్చు పరంగా ఎన్ని పరిమితులు ఉన్నా కంటెంట్ మీద ఫోకస్ పెట్టి యూత్ ని టార్గెట్ చేసుకుంటే వాసూళ్ల వర్షం ఖాయమని మరోసారి నిరూపించింది. అంతా బాగానే ఉంది కానీ హీరోయిన్ వైష్ణవి చైతన్య, హీరోలు ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ లు ఒక్కసారిగా అమాంతం బిజీ కాలేదు. ఆఫర్ల వర్షం వెల్లువలా కురుస్తుందనుకుంటే ఒక్క ఆనంద్ దగ్గరకు మాత్రమే మంచి కథలు వస్తున్నాయి కానీ మిగిలిన ఇద్దరూ సరైన అవకాశం కోసం ఎదురు చూస్తున్నారట. కొన్నిసార్లు అంతే బ్లాక్ బస్టర్ దక్కినా ఎదురుచూపులు తప్పవు.