‘మట్కా’ వెనుక ఇంట్రెస్టింగ్ స్టోరీ

గురువారం టాలీవుడ్లో ఒక స్పెషల్ మూవీ మొదలైంది. అదే.. మట్కా. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా ‘పలాస’ దర్శకుడు కరుణ్ కుమార్ రూపొందిస్తున్న చిత్రమిది. కెరీర్ ఆరంభం నుంచి వైవిధ్యమైన సినిమాలతోనే ప్రయాణం చేస్తున్న వరుణ్.. ఆ కోవలోనే ఈ సినిమాను ఒప్పుకున్నాడు. ‘పలాస’తో బలమైన ముద్ర వేసిన కరుణ్ కుమార్ రెండో చిత్రం ‘శ్రీదేవి సోడా సెంటర్’లోనూ తన ప్రత్యేకతను చాటుకున్నాడు కానీ.. అది కమర్షియల్‌గా ఫెయిల్యూర్ అయింది.

ఆ తర్వాత ఎంతో కసరత్తు చేసి ‘మట్కా’ను పట్టాలెక్కించాడు. చాలా పెద్ద బడ్జెట్లో ఈ సినిమాను నిర్మిస్తోంది వైరా క్రియేషన్స్. ఇంతకుముందు మైత్రీ మూవీ మేకర్స్‌లో భాగస్వామిగా ఉన్న మోహన్ తన మిత్రులతో కలిసి సొంతంగా పెట్టుకున్న వేరే బేనర్ ఇది. ఇందులో తొలి సినిమా నాని హీరోగా చేస్తున్న ‘హాయ్ నాన్న’. ఆ సినిమా విడుదలకు ముందే ‘మట్కా’ పట్టాలెక్కింది.

‘మట్కా’ అంటే ఏంటి అనే సందేహం చాలామందిలో కలిగి ఉండొచ్చు. ఇది రాయలసీమ ప్రాంతంలో ఆడే ఒక గ్యాంబ్లింగ్ గేమ్. ఇదొక రకమైన లాటరీ అనుకోవచ్చు. రోజూ ఉదయం ఒక నంబర్ ఎంచుకుని దాని డబ్బులు కడితే సాయంత్రానికి విన్నింగ్ నంబర్ ప్రకటిస్తారు. దీని మీద నిషేధం ఉన్నప్పటికీ దశాబ్దాలుగా దాన్ని ఆడుతున్న వాళ్లు ఉన్నారు. ఇప్పటికీ కడప సహా పలు రాయలసీమ ప్రాంతాల్లో ఈ ఆట ఆడతారు.

తమిళనాడులో కూడా చెన్నై సహా కొన్ని ప్రాంతాల్లో మట్కా ఆడేవాళ్లు ఉన్నారు. సినిమా వాళ్లకు దీని మీద పెద్దగా అవగాహన లేదు కానీ.. దర్శకుడు కరుణ్ కుమార్ ఒకప్పుడు చెన్నైలో ఉన్నాడు. అక్కడ ఒక హోటల్లో పని చేసే సమయంలో ఆయనకు ఈ ఆట గురించి తెలిసింది. దీని వెనుక నడిచే మాఫియా గురించి తెలుసుకుని.. ఇప్పుడు ఆయన దాని మీద కథ రాశారు. 1960ల నేపథ్యంలో ఆయన ఈ పీరియడ్ మూవీని తీయబోతున్నారు.